ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు ఈ సీజన్ను ఓటమితోనే మొదలుపెట్టాయి. అయితే రెండు జట్లూ స్వల్ప తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయాన్ని చవిచూశాయి. కేకేఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నాలుగు పరుగులు, గుజరాత్ మ్యాచ్లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాయి.
కాగా, సొంత మైదానంలో ఇవాళ జరగనున్న మ్యాచ్లో ముంబైను చిత్తుచేసి ఘనంగా బోణీ కొట్టాలని సన్రైజర్స్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ఆల్రౌండర్ వానిందు హసరంగ ఇంకా జట్టుతో చేరలేదని తెలిపాడు. ముంబై మ్యాచ్కు అందుబాటులో ఉండట్లేదని పేర్కొన్నాడు. ఈ సీజన్లో అతడు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొందని వివరించాడు.

''ఐపీఎల్లో అన్ని జట్లు గొప్పగా ఆడుతుంటాయి. మన హోమ్ గ్రౌండ్ను కంచుకోటగా మార్చుకోవాలి. మా జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకి ఇక్కడ పరిస్థితులపై ఎంతో అవగాహన ఉంది. ఆ అనుభవాన్ని మేం ఇవాళ ఉపయోగించుకుంటాం. సొంతమైదానంలో విజయం సాధించడం ఎంతో ముఖ్యం''
''హసరంగ ఇండియాకు రాలేదు. అతడు స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకుంటున్నాడు. మరికొన్ని రోజుల తర్వాత అతడి గురించి పూర్తి విషయాలు వెల్లడిస్తా'' అని కమిన్స్ పేర్కొన్నాడు. శ్రీలంక స్టార్ ప్లేయర్ హసరంగ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు దాదాపు మరో వారం రోజుల పాటు జట్టుకు దూరం కానున్నాడు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో హసరంగ గాయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదులుకున్న హసరంగను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విన్నర్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. కాగా, ఇటీవల హసరంగపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్లో పాల్గొనకుండా హసరంగపై ఐసీసీ వేటు వేసింది. గత 24 నెలల్లో హసరంగ ఖాతాలో ఎనిమిది డీమెరిట్ పాయింట్లు చేరడంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.
ముంబై మ్యాచ్కు SRH తుదిజట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ , అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: అభిషేక్ శర్మ