కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో తనకు ఉన్న అనుబంధాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వివరించాడు. ఇటీవల కేకేఆర్ మెంటార్గా గంభీర్ బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 టైటిల్ రేసుకు కోల్కతాను సిద్ధం చేస్తున్నాడు.
గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు గంభీర్ మెంటార్గా పనిచేశాడు. లక్నో జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. కానీ, గతేడాది డిసెంబర్లో జరిగిన వేలానికి ముందే లక్నో ఫ్రాంచైజీని గంభీర్ వదిలిపెట్టాడు. తిరిగి కేకేఆర్ గూటికి చేరాడు. కెప్టెన్గా కోల్కతాకు గంభీర్ రెండు సార్లు టైటిల్ అందించాడు. 2012, 2014 సీజన్లలో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు అదే మ్యాజిక్ను ఈ సీజన్లోనూ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అయితే తాను కేకేఆర్లో అడుగుపెట్టినప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో, కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ చెప్పిన మాటలను గంభీర్ గుర్తుచేసుకున్నాడు. విజయాన్ని అందించినా, విచ్ఛిన్నం చేసినా.. ఏదైనా ఫర్వాలేదని షారుక్ ఖాన్ తనతో అన్నాడని గంభీర్ తెలిపాడు. తమ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకునే సమయానికి కేకేఆర్ను మెరుగైన స్థితిలో ఉంచుతానని మాట ఇచ్చాడు.
''నేను కఠినమైన వ్యక్తిని. అయితే ముందుగా కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్, సీఈవో వెంకీ మైసూర్కు థ్యాంక్స్కు చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎంతోకాలం నా కుయుక్తులను, మొండితనాన్ని భరించారు. నిజాయితీతో మేం పోరాడతామని వాళ్లకి తెలుసు. ఎలా ఓడాలో, ఎలా గెలవాలో తెలుసు. షారుక్ ఖాన్ గతంలోనూ ఇప్పుడూ నాతో ఒకే మాట చెబుతున్నాడు. 2011లో కేకేఆర్కు వచ్చిన నాతో 'ఇది నీ ఫ్రాంచైజీ, విజయం లేదా విచ్ఛిన్నం అయినా ఫర్వాలేదు' అన్నాడు. భవిష్యత్లో ఏమవుతుందో నాకు తెలియదు. కానీ నేను ఇక్కడ నుంచి వెళ్లే సమయానికి కేకేఆర్ మెరుగైన స్థితిలో ఉంటుంది'' అని గంభీర్ పేర్కొన్నాడు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 23న కోల్కతా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.