నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కే కొత్త కెప్టెన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ సారథి బాధ్యతలు అందుకున్నాడు.
సీఎస్కే కెప్టెన్సీ మార్పుపై ధోనీ ముందే హింట్ ఇచ్చాడు. ఈ సీజన్లో కొత్త పాత్రలో కనిపించనున్నాని లీగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే తెలిపాడు. కానీ అధికారికంగా గత వారంలో చెన్నై ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే ధోనీ స్థానంలో బాధ్యతలు అందుకున్న రుతురాజ్ ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ధోనీ సూచనలు తీసుకుంటూ తన వ్యూహాలను అమలుపరిచి జట్టును గెలిపించాడు.

అయితే మైదానంలో ధోనీ, రుతురాజ్లలో ఎవరి ఆదేశాలు వినాలో తెలియట్లేదని దీపక్ చాహర్ అన్నాడు. సూచనల కోసం ఎవరి వైపు చూడాలో తెలియక వారిద్దరి వైపు చూస్తున్నాని చాహర్ సరదాగా చెప్పాడు. నిన్న గుజరాత్ టైటాన్స్పై రెండు వికెట్లతో సత్తాచాటిన దీపక్ చాహర్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
''మొదటి నుంచి పవర్ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాను. కొత్త రూల్స్కు తగ్గట్లుగా బంతులు సంధిస్తున్నాను. అంతకుముందు ఓవర్లో తొలి రెండు మూడు బంతుల్లో ఓ బౌన్సర్ వేస్తే..తర్వాత బంతులకు బ్యాటర్ ఫుల్ లెంగ్త్ కోసం సిద్ధంగా ఉండేవాడు. కానీ కొత్త నిబంధనతో ఓవర్లో రెండు బౌన్సర్లు వేయొచ్చు. పేసర్లకు ఇది ఎంతో సాయపడుతుంది. ఇక మ్యాచ్లో సూచనల కోసం ధోనీ, రుతురాజ్లలో ఎవరివైపు చూడాలో తెలియక తికమక పడుతున్నా. అందుకే ఇద్దరివైపు చూస్తున్నా (నవ్వుతూ). రుతురాజ్ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు'' అని దీపక్ చాహర్ తెలిపాడు.
చెపాక్ వేదికగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 63 పరుగుల భారీ తేడాతో గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మెరిసి ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె (51; 23 బంతుల్లో),రచిన్ రవీంద్ర (46; 20 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37; 31 బంతుల్లో) పోరాడాడు. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్పాండే తలో రెండు వికెట్లు తీశారు.