Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ ముంగిట్లో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లీగ్స్ దశలో తన చివరి మ్యాచ్ను ఈ శనివారం ఆడబోతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. చెన్నై సూపర్ కింగ్స్ను మంచి రన్రేట్తో ఓడించగలిగితే ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ బదులుగా తాను ప్లేఆఫ్స్ రేసులో ఉండగలుగుతుంది.
ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి ఆర్సీబీ చెమటోడుస్తోంది. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోంది. ఈ మధ్యలో ఆర్సీబీ ప్లేయర్లు - ఖతర్ ఎయిర్వేస్ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్కు హాజరయ్యారు. ఇందులో విరాట్ కోహ్లీ.. తన క్రికెటింగ్ కేరీర్ గురించి ప్రస్తావించారు.

ఓ స్పోర్ట్స్మెన్గా తన కెరీర్కు తెర పడటం ఖాయమేనని, అందరి విషయాల్లోనూ ఇదే జరుగుతుందని కోహ్లీ పేర్కొన్నాడు. తన కేరీర్ ఎలా ముగియాలనేది తన చేతుల్లో ఉందని, తన అంచనాలకు అనుగుణంగానే ఇది ఉంటుందనీ చెప్పాడు. ఒక్కసారి కేరీర్ ముగిసిన తరువాత ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూడదలచుకోలేదని వ్యాఖ్యానించాడు.
ఫలానా రోజున ఇలా చేసి ఉంటే బాగుండేది..అని ఆలోచిస్తూ స్పోర్ట్స్ కెరీర్ను ముగించాలని కోరుకోవట్లేదని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక్కసారి వీడ్కోలు పలికినప్పుడు ఇక మళ్లీ దాన్ని ఎప్పటికీ కొనసాగించలేమని, అందుకే ఎలాంటి పొరపాట్లు, తప్పులకు అవకాశం ఇవ్వకూడదనేది తన అభిప్రాయమని అన్నాడు.
ఎలాంటి పశ్చాత్తాపం పడకుండా కేరీర్ను ముగించాలనుకుంట పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని చెప్పాడు. తన కేరీర్లో ఎటువంటి పశ్చాత్తాపం కలిగి ఉండదని ఖచ్చితంగా భావిస్తున్నానని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. రిటైరయ్యాక.. ఏమి చేయాలనే విషయం గురించి ఇప్పుడిప్పుడే ఎలాంటి ఆలోచన చేయట్లేదని, దానికి ముందు సుదీర్ఘ విరామం తీసుకుంటానని అన్నాడు.
ఎప్పటివరకు క్రికెట్ ఆడుతానో.. అప్పటివరకు దాని కోసమే తన సర్వస్వాన్ని ధారపోస్తానని కోహ్లీ చెప్పాడు. ఒక్కసారి రిటైర్ అయ్యాక.. ఇక మళ్లీ వెనక్కి రాలేమని, అప్పటివరకు ఒక స్పోర్ట్స్మెన్గా ప్రతి నిమిషాన్నీ ఎంజాయ్ చేస్తాననీ వివరించాడు.