ఐపీఎల్-2024లో లీగ్ దశ క్లైమాక్స్ చేరుకుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను ఆడనున్నాయి. ఈ పోరుకు వాంఖడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. అయితే ఇప్పటికే ముంబై జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ముంబై జట్టుకు ఇది కేవలం నామమాత్రపు మ్యాచే.
కానీ లక్నోపై గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని కాస్త మెరుగుపర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. 13 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన హార్దిక్ సేన పాయింట్ల టేబుల్లో అట్టడుగన నిలిచింది. అయితే ఇవాళ మ్యాచ్లో ఘన విజయం సాధిస్తే తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ (10 పాయింట్లు)ను అధిగమించే ఛాన్స్ ఉంటుంది.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. కానీ సాంకేతికంగా లక్నో పోటీలోనే ఉంది. అయితే తదుపరి దశకు చేరుకోవాలంటే ముంబై ఇండియన్స్పై లక్నో సుమారు 310 పరుగుల తేడాతో గెలవాలి. ఐపీఎల్లో ఏ జట్టు ఇప్పటివరకు 300 స్కోరు మార్క్ను అందుకోలేదు. ఇక, 300+ పరుగుల తేడాతో గెలవాలంటే అది అసాధ్యమే.
లక్నో 310 పరుగుల తేడాతో గెలిచినా నేరుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు. ఆర్సీబీ-సీఎస్కే జట్టు ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సీఎస్కేపై ఆర్సీబీ గెలిస్తే ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అయితే బెంగళూరు కంటే లక్నో మెరుగైన రన్రేటు పొందాలంటే.. సీఎస్కేపై ఆర్సీబీ గరిష్ఠంగా 18 పరుగుల తేడాతోనే గెలవాలి. అంతకంటే ఎక్కువ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ నెగ్గితే లక్నో కూడా ముంబైపై 310 పరుగులకు పైగా తేడాతో విజయం సాధించాలి.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, నెహాల్ వదేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, కొయెట్జీ, పీయూష్ చావ్లా
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, డికాక్, స్టొయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, యుద్వీర్ సింగ్.