రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్పై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ టైమింగ్ టేకింగ్ షాట్లతో పాటు గొప్ప స్ట్రైక్రేట్తో అదరగొట్టాడని లారా కొనియాడాడు. జైపుర్ వేదికగా ముంబైతో సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (63; 45 బంతుల్లో, 5x4, 3x6), నెహాల్ వదేరా (49; 24 బంతుల్లో, 3x4, 4x6) టాప్ స్కోరర్లు. సందీప్ శర్మ అయిదు వికెట్లతో (5/18)తో చెలరేగాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (104*; 60 బంతుల్లో, 9x4, 7x6) అజేయం శతకంతో అదరగొట్టాడు. ఆఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

''జైస్వాల్ ఆట చాలా అందంగా ఉంది. బంతిని గమనిస్తూ క్రికెటింగ్ షాట్లతో అలరించాడు. అతని ఆటలో అన్నీ ఉన్నాయి. దేని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. గొప్ప బౌలర్లను ఎదుర్కొనేప్పుడు మన సమయాన్ని తీసుకోవాలి. అతను అదే చేశాడు. జైస్వాల్లో నాకు నచ్చే విషయం అదే. జైపుర్లో మంచి స్కోరు ఛేజింగ్ చేయాలంటే నిలదొక్కుకుంటూ ఇన్నింగ్స్ క్రమంగా పుంజుకోవచ్చు. బాధ్యతలను అందుకుంటూ జైస్వాల్ పరిపక్వత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు తిరిగి ఫామ్లో వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది'' అని లారా పేర్కొన్నాడు.

ముంబైపై సెంచరీ సాధించిన అనంతరం జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు శతకాలు సాధించిన 23 ఏళ్లలోపు ఏకైక ప్లేయర్గా రికార్డులకెక్కాడు. 22 ఏళ్ల జైస్వాల్ ఈ రెండు సెంచరీలు ముంబై ఇండియన్స్పైనే సాధించడం విశేషం. 2023లోవాంఖడేలో ముంబైపై తొలి సెంచరీ బాదాడు. 124 పరుగులు చేశాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో ఈ మూడంకెల స్కోరును అందుకున్నాడు. అనంతరం నిన్న మరో శతకాన్ని సాధించాడు. 22 ఏళ్ల 116 రోజుల వయసులో మరో శతకాన్ని బాదాడు.