వైజాగ్లో 'వింటేజ్ ధోనీ'ని చూసి అభిమానులు మురిసిపోయారు. రెగ్యులర్ క్రికెట్కు దూరమైనా, గాయంతో బాధపడుతూ కూడా 42 ఏళ్ల ధోనీ తన ఫ్యాన్స్కు మాత్రం ఫుల్ మీల్స్ అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. నాలుగు బౌండరీలు, మూడు భారీ సిక్సర్లు బాది 16 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సాధించాడు.
అంతకుముందు తొలి రెండు మ్యాచ్ల్లో ధోనీ బ్యాటు పట్టకుండానే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. కానీ ఢిల్లీ మ్యాచ్లో ధోనీ బ్యాటర్గా బరిలోకి దిగాడు. ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్యే అన్నట్లుగా చెలరేగాడు. ఈ క్రమంలో శుక్రవారం జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్-సీఎస్కే మ్యాచ్పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అంతేగాక ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్లో ధోనీని చూసే అవకాశం ఇదే ఆఖరిసారి కావడంతో SRH-CSK మ్యాచ్ టిక్కెట్ల కోసం సీఎస్కే అభిమానులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే SRH మ్యాచ్కు ధోనీ అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. సన్రైజర్స్ మ్యాచ్కు ధోనీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ధోనీ కాలికి పట్టి ఉన్న ఫొటోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
గత సీజన్లో మోకాలి గాయంతోనే బరిలోకి దిగిన ధోనీ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సీజన్ కోసం కొన్ని నెలల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే ఈ క్రమంలో ధోనీ గాయం తిరిగబెట్టినట్లుగా తెలుస్తోంది. విశ్రాంతి ఇవ్వకపోతే లీగ్ మధ్యలో ధోనీ అర్ధంతరంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సీఎస్కే మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఢిల్లీ మ్యాచ్ అనంతరం చెన్నై కోచ్ ఫ్లెమింగ్ ధోనీ బ్యాటింగ్ గురించి మాత్రమే వ్యాఖ్యలు చేశాడే తప్ప గాయం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
మరోవైపు మహీ దూరమవుతాడనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ధోనీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ధోనీ కోసమే మ్యాచ్ టిక్కెట్లు కొనుగోలు చేశామని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన సీఎస్కే రెండింట్లో విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ రెండింట్లో ఓడి ఓ మ్యాచ్ను గెలిచింది.