ఐపీఎల్-2024 సీజన్ ఆటతో పాటు వివాదాలతోనూ ఆసక్తికరంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు గొడవ ఇంకా సద్దుమణగట్లేదు. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలను అందించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. క్రికెటర్లు, మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీ మాట్లాడాడు.
కెప్టెన్సీ మార్పు నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీది అని గంగూలీ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యను హేళన చేయడం ఆపేయాలని, దీనిలో అతడి తప్పేమి లేదని అన్నాడు. మరోవైపు రోహిత్ శర్మను దాదా కొనియాడాడు. ముంబై ఫ్రాంచైజీ, టీమిండియా తరఫున రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడని తెలిపాడు.

''హార్దిక్ పాండ్యను ప్రేక్షకులు హేళన చేయడం ఆపేయాలి. ఇది అసలు కరెక్ట్ కాదు. అతన్ని ఫ్రాంచైజీ కెప్టెన్గా నియమించింది. ఇది ఆటలో సహజం. ప్లేయర్లను కెప్టెన్గా నియమిస్తుంటారు. ముంబై కెప్టెన్సీ మార్పు నిర్ణయంలో హార్దిక్ పాండ్య తప్పేమి లేదు. ఇక రోహిత్ శర్మది డిఫరెంట్ క్లాస్. ఫ్రాంచైజీ తరఫున, భారత్ తరఫున అతడు ఆటగాడిగా లేదా సారథిగా గొప్పగా రాణించాడు'' అని గంగూలీ అన్నాడు.
కాగా, వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ట్రేడ్కు ముందు కెప్టెన్సీ ఒప్పందంతోనే హార్దిక్ ముంబై గూటికి చేరాడని కథనాలు వచ్చాయి. మరోవైపు రోహిత్ శర్మను బలవంతంగా సారథి బాధ్యతలు నుంచి తప్పించాడని ప్రచారం జోరుగా సాగింది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ను కెప్టెన్ చేయడంపై జట్టులో బయటా అసంతృప్తి మొదలైంది.
ఈ నేపథ్యంలో హార్దిక్ను రోహిత్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టేడియంలో హార్దిక్ను హేళన చేస్తున్నారు. అంతేగాక ముంబై జట్టులో రెండు గ్రూప్లు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. రోహిత్ మద్దతుదారులు ఓ వర్గంగా ఏర్పడ్డారని, అందులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.