ఐపీఎల్-2024 సీజన్ అర్ధభాగం దాదాపు ముగిసింది. గత సీజన్లకు భిన్నంగా ఈ లీగ్ సాగుతోంది. ఎవరి ఊహలకు అందని విధంగా అంచనాలు లేని జట్లు టాప్లో ఉంటున్నాయి. మరోవైపు స్ట్రాంగ్ టీమ్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టేబుల్ అట్టడుగన నిలిచాయి.
అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని ముకేశ్ అంబానీ కారణంగా మూడు జట్లు నాశనమయ్యాయని నెట్టింట చర్చ మొదలైంది. ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ముంబై ఇండియన్స్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆల్రౌండర్ హార్దిక్ రాక కోసం కామెరూన్ గ్రీన్ను ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తెలివిగా అప్పగింది. ఆ తర్వాత తన పర్స్ వ్యాల్యూ పెంచుకుని హార్దిక్ను ముంబై సొంతం చేసుకుంది.

హార్దిక్ కోసమే జరిగిన ఈ ప్రక్రియతో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, ముంబై ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయాయి. ట్రేడింగ్ అనంతరం ఈ మూడు జట్లకు ఏదీ కలిసిరావట్లేదు. ముంబైలో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన గ్రీన్ బెంగళూరు జట్టులో తేలిపోయాడు. రూ. 17.5 కోట్ల భారీ ధర, స్టార్ ప్లేయర్ కావడంతో సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్ల్లో గ్రీన్ను కష్టంగా ఆర్సీబీ జట్టులో కొనసాగించింది. కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత తేరుకుని గ్రీన్ను పక్కనపెట్టింది. గ్రీన్ను జట్టులోకి రాకపోతే అతని కోసం వెచ్చించిన మొత్తంతో ఆర్సీబీ ఓ మంచి బౌలర్ను కొనుగోలు చేసేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్య వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ పరిస్థితి దారుణంగా మారింది. కొత్త కెప్టెన్ గిల్పై ఒత్తిడి పెరిగింది. అంతేగాక మహ్మద్ షమి కూడా దూరమవ్వడం ఆ జట్టుకు ఎదురుదెబ్బగా మారింది. హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వేలంలో తీసుకున్న స్పెన్సర్ జాన్సన్ (రూ.10 కోట్లు), షారుక్ ఖాన్ (రూ.7.40 కోట్లు) ఘోరంగా విఫలమవుతున్నారు.
ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి అధ్వానంగా మారింది. హార్దిక్ రాక ముంబై జట్టును రెండు గ్రూప్లుగా చీల్చింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై రోహిత్, రోహిత్ గ్రూప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జట్టులో పాటు ప్రేక్షకుల నుంచి నెలకొన్న ఒత్తిడితో హార్దిక్ చిత్తు అవుతున్నాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. దీంతో హార్దిక్ను తీసుకోవడానికి అంబానీ చేసిన పని మూడు జట్లను సర్వనాశనం చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రస్తుతం గుజరాత్ ఏడో స్థానంలో, ముంబై, ఆర్సీబీ వరుసగా తొమ్మిది, పదో స్థానంలో ఉన్నాయి.