Gujarat Titans: ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టుకు తొలి సీజన్లోనే ట్రోఫీ అందించి, రెండో సీజన్లో రన్నరప్గా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలేసింది. అతన్ని ముంబై ఇండియన్స్కు ట్రేడ్ చేసింది. ఈ నిర్ణయం చాలా మంది గుజరాత్ ఫ్యాన్స్కు గట్టి షాకిచ్చింది.
ఈ క్రమంలోనే తను మళ్లీ ముంబైకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసిన హార్దిక్ పాండ్యా.. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి వీడ్కోలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ ఎమోషనల్ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనకు ఇంతకాలం అందించిన సహకారానికి ఫ్యాన్స్, మేనేజ్మెంట్ అందరికీ పాండ్యా ధన్యవాదాలు తెలియజేశాడు.

'గుజరాత్ టైటాన్స్లో ఫ్యాన్స్, టీం, మేనేజ్మెంట్ అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నా. ఈ టీంలో భాగంగా ఉండటం, నాయకత్వం వహించడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఒక వ్యక్తిగా, ప్లేయర్గా నాకు, నా కుటుంబానికి లభించిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు' అని చెప్పాడు.
'జీటీతో నా అనుభవాలు, జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచే ఉంటాయి. ఈ మర్చిపోలేనే ప్రయాణాన్ని అందించినందుకు అందరికీ ధన్యవాదాలు' అని పాండ్యా పోస్టు చేశాడు. అతను ముంబై ఇండియన్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ముంబైలో కీలకమైన ప్లేయర్గా ఎదిగిన అతన్ని.. 2022 మెగావేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అప్పుడే కొత్తగా వచ్చిన ఆ జట్టుకు అద్భుతంగా నాయకత్వం వహించిన పాండ్యా.. తొలి సీజన్లోనే జట్టును ఛాంపియన్గా నిలిపాడు. ఇక ఈ ఏడాది జరిగిన రెండో సీజన్లో ఫైనల్ చేరినా.. చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.