IPL 2024: ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా కోసం కొన్ని రోజులుగా ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తోంది. అతన్ని ఎలాగైనా తిరిగి జట్టులోకి తీసుకోవాలని, అతన్ని టీం ఫ్యూచర్ కెప్టెన్గా తయారు చేయాలని అనుకుంటూ వచ్చింది. అయితే గుజరాత్ ఫ్రాంచైజీ దీనికి నిరాకరించింది. ఈ క్రమంలోనే తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్లలో పాండ్యా కూడా ఉన్నట్లు గుజరాత్ ప్రకటించింది.
దీంతో పాండ్యా మళ్లీ ముంబైకి ఆడతాడనే వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లు అయింది. ఇలాంటి సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి అమ్మేసింది. పూర్తి క్యాష్కు అతన్ని ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. ఈ ట్రేడ్తో సమకూరిన భారీ డబ్బుతో గుజరాత్ టైటాన్స్ నుంచి పూర్తి సొమ్ము చెల్లించి హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది.

ఈ నిర్ణయం విన్న ముంబై ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తమ పాండ్యా ముంబైకి ఆడుతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గ్రీన్ను వదులు కోవడం అంత గొప్ప నిర్ణయం కాదని మరికొందరు అంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి ఇదే విషయంపై నెట్టింట తెగ చర్చ జరుగుతూ వచ్చింది. కొందరేమో ఏం జరిగినా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఇలాంటి నిర్ణయం తీసుకోదని, పాండ్యాను వదులుకోదని జీటీ ఫ్యాన్స్ అనుకున్నారు.
అలాగే పాండ్యా కోసం రోహిత్ను ట్రేడ్ చేస్తారని వార్తలు రావడంతో ముంబై ఫ్యాన్స్ కూడా నవ్వుకున్నారు. మరీ ఇంత తెలివి తక్కువ నిర్ణయం ఎవరైనా ఎలా తీసకుంటారని ప్రశ్నించారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ గుజరాత్ జట్టు.. తమ కెప్టెన్ను ట్రేడ్ చేయడం చాలా మందికి షాకిచ్చిందనే చెప్పాలి.