అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్పై గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో ఐపీఎల్ 17వ సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. అయితే ఓ దశలో గుజరాత్ ఓటమి దిశగా పయనించింది. అయినా పట్టుదలతో పోరాడి అంతిమంగా గెలుపు తీరాలకు చేరింది.
విజయంలో గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాది కీలక పాత్ర. ముంబై చివరి ఆరు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన తరుణంలో నెహ్రా బౌండరీ లైన్ వద్దే ఉండి తన వ్యూహాలను జట్టుకు అందించాడు. ఏ సమయంలో ఎలా బంతులు సంధించాలో మైదానం అవతల ఉండే బౌలర్లకు కబురు పంపాడు.

గత రెండు సీజన్లలో హార్దిక్ పాండ్య సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరింది. కానీ ఈ సారి హార్దిక్ ముంబై గూటికి చేరాడు. దీంతో గుజరాత్ పనైపోయినట్లే అని అందరూ భావించారు. అయితే గుజరాత్ గత అద్భుత ప్రదర్శనకు కారణం కెప్టెన్ హార్దిక్ కాదని, జట్టు సమష్టి కృషి, నెహ్రా వ్యూహాలను నిన్న రుజువైంది.
ధారళంగా పరుగులు సమర్పిస్తాడని పేరు ఉన్న ఉమేశ్ యాదవ్కు గుజరాత్ నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ ధైర్యంగా ఆఖరి ఓవర్ వేయమని బంతిని అందించడానికి కారణం నెహ్రానే. హార్దిక్ భారీ హిట్టింగ్కు ట్రై చేస్తాడని నెహ్రా భావించి ఉమేశ్ను బౌన్సర్లు వేయమని సూచించాడు. తొలి బంతికి హార్దిక్ సిక్సర్ బాదినా మూడో బంతికి నెహ్రా ట్రాప్లో చిక్కుకున్నాడు. లాంగాఫ్లో ఉన్న రాహుల్ తెవాతియా చేతికి హార్దిక్ చిక్కాడు.
అంతేగాక హార్దిక్ పవర్ హిట్టింగ్ ఆర్క్లో గిల్ చురుకైన ఫీల్డర్లను మోహిరించడంలో నెహ్రాది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో నెహ్రా ప్రణాళికలపై ప్రశంసలు దక్కుతున్నాయి. 'ఇతర జట్ల ప్రధాన కోచ్లంతా ల్యాప్టాప్స్, ట్యాబ్స్లో ప్రత్యర్థి బలాబలాలు చూస్తూ, గణాంకాలు పరిశీలిస్తూ ప్రణాళికలు రచిస్తుంటారు. కానీ గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రం సింపుల్గా ఓ పేపర్, పెన్ను ఉపయోగిస్తూ మాస్టర్ ప్లాన్ వేస్తుంటాడు. ప్రత్యర్థులను ఉపయోగించడానికి టెక్నాలజీ, స్టాట్స్ అవసరం లేదని మరోసారి నెహ్రా నిరూపించాడు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.