లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ముంబై ఇండియన్స్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ప్లేయర్లకు జరిమానా విధించారు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 144 పరుగులు చేసింది.
నెహాల్ వదేరా (46; 41 బంతుల్లో, 4x4, 2x6), టిమ్ డేవిడ్ (35; 18 బంతుల్లో, 3x4, 1x6) టాప్ స్కోరర్లు. మోహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు (2/36) తీశాడు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ స్వల్ప లక్ష్యం కోసం చెమటోడ్చింది. 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్కస్ స్టొయినిస్ (62; 45 బంతుల్లో, 7x4, 2x6) అర్ధశతకంతో రాణించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు (2/26) పడగొట్టాడు.

అయితే లక్నో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రూ.24 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో హార్దిక్పై ఫైన్ విధించడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ను ఆలస్యంగా కొనసాగించినందుకు హార్దిక్కు రూ.12 లక్షల ఫైన్ వేశారు. ఈ పొరపాటును మరోసారి పునరావృతం కావడంతో జరిమానాను రెట్టింపు చేశారు. అంతేగాక ముంబై ప్లేయర్లపై కూడా కొరడా ఝుళిపించారు.
ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ముంబై ఇండియన్స్ తుది జట్టు సభ్యులకు కూడా ఫైన్ వేశారు. రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతంలో ఏదీ తక్కువగా ఉంటే దాన్ని జరిమానాగా విధించామని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ సీజన్లో ముంబై టీమ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. సీజన్ ఆరంభంలో ఆలస్యంగా గెలుపు రుచి చూసిన ముంబై తాజాగా మరోసారి హ్యాట్రిక్ పరాజయాల్ని చవిచూసింది. పది మ్యాచ్లు ఆడిన హార్దిక్సేన కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నుంచి రెండో స్థానంలో నిలిచింది.