రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పగ్గాలను తిరిగి విరాట్ కోహ్లికి అప్పగించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లి జట్టులో నూతన ఉత్సాహాన్ని తీసుకువస్తాడని, అది ఆర్సీబీకి అదనపు బలంగా మారుతుందని అన్నాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఆరు మ్యాచ్లు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో అయిదో స్థానానికి చేరింది.
కానీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం సాధించాలి. 18 పరుగుల తేడాతో లేదా 11 బంతులు మిగిలుండగానే గెలవాలి. అంతేగాక లక్నో సూపర్ జెయింట్స్ కూడా 14 పాయింట్లే సాధించాలి. అయితే ఒకవేళ బెంగళూరు తదుపరి దశకు అర్హత సాధించకపోతే జట్టు యాజమాన్యం పునరాలోచించాలని హర్భజన్ సింగ్ అన్నాడు. వచ్చే సీజన్లో కోహ్లిని కెప్టెన్ చేయాలని సూచించాడు.

''ఆర్సీబీ అర్హత సాధించకపోతే, భారత ఆటగాడిని కెప్టెన్గా నియమించాలి. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్గా ఎందుకు నియమించకూడదు? చెన్నైలో ధోనీ ఇంపాక్ట్ చూపిస్తున్న విధంగా కోహ్లి చేయగలడు. కోహ్లి గొప్ప లీడర్. ఎలాంటి క్రికెట్ ఆడాలో తనకి తెలుసు.ప్రస్తుతం బెంగళూరు ఎంతో దూకుడుగా, తీవ్రతతో ఆడుతోంది. కోహ్లి జట్టును అదే జోరులో తీసుకెళ్తాడు. అతను సారథిగా బెంగళూరును ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను'' అని హర్భజన్ సింగ్ అన్నాడు.
కాగా, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంజైజీ యజమాని సంజీవ్ గోయెంకా అమర్యాదగా ప్రవర్తించిన ఘటనపై హర్భజన్ స్పందించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం మైదానంలోనే రాహుల్పై సంజీవ్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాహుల్తో ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు.
''టీమ్ ఓనర్, కెప్టెన్ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే గోడల మధ్య చర్చ జరగాలి. అది అందరికీ మంచిది. డ్రెస్సింగ్ రూమ్ లోపల ఇలాంటి చర్చ సాగాలి. అయితే జరిగిన సంఘటన జట్టుకు మంచిది కాదు. ఆ ఘటన జరిగిన సమయం కూడా సరైనది కాదు. కేకేఆర్ యూనిట్ గొప్పగా ఉంటుంది. ఆ ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ క్రికెట్ విషయాల్లో జోక్యం చేసుకోడు. ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు ఎంతో భద్రతగా ఉన్నామని భావన ఉంటుంది. ఇలా సంతోషంగా ఉండే జట్టు విజేతగా నిలుస్తుంది'' అని భజ్జీ అన్నాడు.