ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించాయి. మిగిలిన మ్యాచ్ల్లో గెలిచి తదుపరి దశకు చేరుకోవాలనుకున్న గుజరాత్ ఆశలకు వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా నిన్న జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్-గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
దీంతో గుజరాత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు కేకేఆర్ జట్టు మాత్రమే ప్లేఆఫ్స్కు అధికారికంగా క్వాలిఫై అయ్యింది. మిగిలిన మూడు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. ఈ జట్లలో రాజస్థాన్ తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమైంది.

మిగిలిన రెండు స్థానాల కోసం జరిగే ఫైట్ టఫ్గా ఉండనుంది. సీఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. నెట్రన్రేటు మెరుగ్గా ఉన్న జట్లు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా సునాయాసంగా ప్లేఆఫ్స్కు చేరుతాయి. అయితే ప్లేఆఫ్స్కు సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ అర్హత సాధించవని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు.
కేకేఆర్తో పాటు రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే, ఆర్సీబీ ప్లేఆఫ్స్కు క్వాలిఫై అవుతాయని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అయితే 12 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి ఎలా నిష్క్రమిస్తుందని భజ్జీ వ్యాఖ్యలతో ఆరెంజ్ ఆర్మీ ఏకీభవించట్లేదు. కానీ సాంకేతికంగా హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నాకౌటయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎలా అంటే..

ఉప్పల్ వేదికగా గుజరాత్, పంజాబ్ జట్లతో జరగనున్న మ్యాచ్ల్లో ఓటమిపాలైతే సన్రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం +0.406 నెట్రన్రేటుతో ఉన్న ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడితే కచ్చితంగా నెట్రన్రేటు తగ్గుతుంది. మరోవైపు ఒకవేళ ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడి, హైదరాబాద్ కంటే మెరుగైన రన్రేటు ఉంటే చెన్నై జట్టుకు కలిసొస్తుంది.
వీటితో పాటు ఢిల్లీ, లక్నో జట్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఒక్క విజయమే సాధిస్తే.. ఈ జట్లు అన్నీ 14 పాయింట్లతో నిలుస్తాయి. ఈ టీమ్స్లో మెరుగైన రన్రేటు ఉన్న జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. ఈ సమీకరణాలతో హైదరాబాద్ ప్లేఆఫ్స్కు వెళ్లదని హర్భజన్ సింగ్ విశ్లేషించాడు.