ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం కొనసాగుతూనే ఉంది. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు సారథి బాధ్యతలు అందించడంపై ఫ్రాంచైజీ అభిమానులతో పాటు జట్టులో కొందరు ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. ఆటగాళ్ల నుంచి హార్దిక్కు ఆశించిన మద్దతు దక్కట్లేదు. మరోవైపు అభిమానుల నుంచి ఈ స్టార్ ఆల్రౌండర్కు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి.
దీనికి తోడుగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన హార్దిక్ పాండ్యకు మరో తలనొప్పిగా మారింది. గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ల్లో ముంబై ఓటమిపాలైంది. అయితే ఆ రెండు మ్యాచ్లు ప్రత్యర్థి మైదానంలో జరిగాయి. హోమ్ గ్రౌండ్లో అయినా విజయాన్ని అందుకోవాలనుకున్న ముంబై ఆశలకు రాజస్థాన్ రాయల్స్ చెక్క పెట్టింది. వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ముంబైను రాజస్థాన్ ఓడించింది.

అయితే రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్య డగౌట్లో బాధతో ఒంటరిగా కూర్చున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు. హార్దిక్ను అలా చూడలేకపోతున్నానని అన్నాడు. ఓ కెప్టెన్కు ఇలాంటి పరిస్థితి రావొద్దని పేర్కొన్నాడు.
''హార్దిక్ను అలా చూడటం అస్సలు బాగోలేదు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆటగాళ్లు హార్దిక్ను కెప్టెన్గా అంగీకరించాలి. తీసుకున్న నిర్ణయంపై జట్టు మొత్తం కట్టుబడి ఉండాలి. ఈ జట్టుకు ఆడిన ఆటగాడిగా చెబుతున్నా.. ప్రస్తుత పరిస్థితులు చక్కగా లేవు'' అని హర్భజన్ సింగ్ అన్నాడు. దీనికి మాజీ బ్యాటర్ అంబటి రాయుడు స్పందించాడు. హార్దిక్ అయోమయంగా కనిపిస్తున్నాడని, స్వేచ్ఛగా సారథి బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాడని రాయుడు అన్నాడు.
అంబటి రాయుడు వ్యాఖ్యలకు హర్భజన్ సింగ్ బదులిచ్చాడు. ''ముంబై జట్టులో ఉన్న ఆటగాళ్లు హార్దిక్ పాండ్యను అయోమయానికి గురిచేస్తున్నారు. వాళ్లు అంతర్జాతీయ ఆటగాళ్లు లేదా దేశీయ ఆటగాళ్లు కావొచ్చు. అంతేగాక డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న పెద్దలు..హార్దిక్ను స్వేచ్ఛగా కెప్టెన్సీని చేసుకోనివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితి రావడం ఏ కెప్టెన్కు మంచిది కాదు'' అని భజ్జీ పేర్కొన్నాడు. గతంలో ముంబయి ఇండియన్స్కు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
కాగా, వేలానికి ముందు గుజరాత్ టైటాన్సు నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసుకుంది. అయితే ట్రేడ్కు ముందు కెప్టెన్సీ ఒప్పందంతోనే హార్దిక్ ముంబై గూటికి చేరాడని కథనాలు వచ్చాయి. మరోవైపు రోహిత్ శర్మను బలవంతంగా సారథి బాధ్యతలు నుంచి తప్పించాడని ప్రచారం సాగింది. దీంతో హార్దిక్ను రోహిత్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్టేడియంలో హార్దిక్ను హేళన చేస్తున్నారు. అంతేగాక ముంబై జట్టులో రెండు గ్రూప్లు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. రోహిత్ మద్దతుదారులు ఓ వర్గంగా ఏర్పడ్డారని, అందులో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.