గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు షాక్ తగిలింది. గిల్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ నయా కెప్టెన్కు ఈ ఫైన్ విధించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్ శుభ్మన్ గిల్గా నిలిచాడు.
''ఐపీఎల్-2024లో మార్చి 26న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం గిల్కు రూ. 12 లక్షల జరిమానా విధించాం'' అని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

గిల్ ఇటీవల సారథిగా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్కు వెళ్లడంతో గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ముంబైపై విజయం సాధించిన గిల్ చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్లో ఓటమిపాలయ్యాడు.అంతేగాక స్లో ఓవర్రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ వేదికగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గుజరాత్ టైటాన్స్తో 63 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసిది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె (51; 23 బంతుల్లో),రచిన్ రవీంద్ర (46; 20 బంతుల్లో), రుతురాజ్ గైక్వాడ్ (46; 36 బంతుల్లో) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37; 31 బంతుల్లో) పోరాడాడు. గిల్ అయిదు బంతుల్లో 8 పరుగులు చేసి చాహర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్పాండే తలో రెండు వికెట్లు తీశారు.