అహ్మదాబాద్ వేదికగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), అభిషేక్ శర్మ (29; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. మోహిత్ శర్మ (3/25) మూడు వికెట్లతో మెరిశాడు.
అనంతరం ఛేదనకు దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. సాయి సుదర్శన్ (45; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (36; 28 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఛేదనలో సత్తాచాటారు.

అయితే మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం పేలవమైనదిగా భావించట్లేదని అన్నాడు. మరో పది నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ను కాపాడుకునే వాళ్లమని కమిన్స్ చెప్పాడు. 11వ ఓవర్లో ఆలస్యంగా బంతిని అందుకోవడం గురించి కూడా తన ప్రణాళికను కమిన్స్ వెల్లడించాడు.
''మ్యాచ్ గొప్పగా సాగింది. మేం మరో 10-15 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్ మెరుగ్గా బౌలింగ్ చేసింది. మేం క్రమంగా వికెట్లు కోల్పోయాం. మా బ్యాటర్లలో ఎవరూ 50+ స్కోరు సాధించలేకపోయారు. ఇదే ఇరు జట్ల మధ్య వ్యత్సాసం. ఇక నా బౌలింగ్ విషయానికొస్తే.. వికెట్ మరింత స్లోగా మారుతుందని భావించి ఆలస్యంగా బౌలింగ్ చేశాను. ఆఫ్ కట్టర్స్ ప్రభావితం చూపిస్తాయనుకున్నాం''
''టాస్ విషయంలో ఎలాంటి బాధ లేదు. రెండు ఇన్నింగ్స్ల్లో పిచ్ ఒకేలా స్పందించింది. ఇక బ్యాటింగ్ గురించి చెప్పాలంటే.. ఇది టీ20 క్రికెట్. గత మ్యాచ్లో మా బ్యాటర్లు సత్తాచాటారు. ఇవాళ కూడా సానుకూలంగానే ఆడారు. కానీ వికెట్లు కోల్పోయాం'' అని కమిన్స్ పేర్కొన్నాడు. నాలుగు ఓవర్లు వేసిన కమిన్స్ 28 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.