ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ముంబై ఇండియన్స్పై రికార్డు స్కోరు సాధించి జోరు మీదున్న ఎస్ఆర్హెచ్ ఇవాళ మ్యాచ్లో గుజరాత్ను ఓడించాలని కసిగా బరిలోకి దిగుతోంది.
మరోవైపు తొలి మ్యాచ్లో ముంబైపై విజయం సాధించి రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన గుజరాత్ టైటాన్స్ తిరిగి గెలుపు బాట పట్టాలని పట్టుదలతో అడుగుపెడుతోంది. సొంతమైదానంలో హైదరాబాద్ను ఓడించి సత్తాచాటాలని భావిస్తోంది. ఇక అహ్మదాబాద్ పిచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్లో భారీ స్కోరు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మైదానంలో బౌండరీ పరిమాణం అన్ని వైపులా సమానంగా లేదు. ఓ వైపు థర్డ్ మ్యాన్ దిశగా 58 మీటర్లు, స్కూప్ దిశగా 53 మీటర్ల దూరం మాత్రమే ఉంది. అలాగే డౌన్ ది గ్రౌండ్ వైపు 73 మీటర్ల దూరంలో బౌండరీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో హిట్టర్లు ప్రధాన పాత్ర పోషించేలా ఉన్నారు. ఐపీఎల్లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా గుజరాత్ రెండు సార్లు, హైదరాబాద్ ఒక్కసారి విజయం సాధించింది.
కాగా, టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. నటరాజన్, మార్కో జేన్సన్ బెంచ్కే పరిమితమవుతున్నారని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ పేర్కొన్నాడు. గత మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతున్నామని చెప్పాడు. ముంబై మ్యాచ్లో గాయాల కారణంగా నటరాజన్, జేన్సన్ తుదిజట్టులో లేరు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తమ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, దర్మన్ నల్కండే.