సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తనకి లభించిన శుభారంభాన్ని మంచి ఇన్నింగ్స్గా మలచలేకపోయాడు. 17 బంతుల్లో 16 పరుగులే చేసి పెవిలియన్కు చేరాడు. అజ్మతుల్లా బౌలింగ్లో దర్మన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కోల్కతాతో జరిగిన తొలి మ్యాచ్లో మయాంక్ 21 బంతుల్లో 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ ముంబైతో జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లో 11 పరుగులే చేశాడు. ఈ పోరులో సన్రైజర్స్ రికార్డు స్కోరు సాధించిన విషయం తెలిసిందే. 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఈ మ్యాచ్లో దాదాపు రెండు ఓవర్లు ఆడిన మయాంక్ బంతికో పరుగు చొప్పున కూడా స్కోరు సాధించలేకపోయాడు.

తాజాగా గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లోనూ మయాంక్ అగర్వాల్ 100 స్ట్రైక్రేటుకు దిగువగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు సన్రైజర్స్ మాజీ కెప్టెన్ మార్క్రమ్ కూడా నిరాశపరిచాడు. కోల్కతాపై 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ముంబైపై 28 బంతుల్లో 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ గుజరాత్పై 19 బంతుల్లో 17 రన్స్ మాత్రమే చేశాడు. ఈ పోరులో మార్క్రమ్ ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్రమ్పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. మయాంక్, మార్క్రమ్కు బదులుగా రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్ అవకాశాలు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రావిస్ హెడ్ (19; 14 బంతుల్లో, 3 ఫోర్లు), అభిషేక్ శర్మ (29; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (24; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షాబాజ్ అహ్మద్ (22; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పరుగులు చేశారు.