గత మ్యాచ్లో 277 పరుగుల రికార్డు స్కోరు సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ఉసూరుమనిపించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో అంచనాలు అందుకోలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్కు శుభారంభం లభించలేదు. మయాంక్ అగర్వాల్ (16; 17 బంతుల్లో, 2 ఫోర్లు) మరోసారి నిరాశపరిచాడు. అజ్మతుల్లా బౌలింగ్లో దర్మన్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (19; 14 బంతుల్లో, 3 ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. హెడ్ను నూర్ అహ్మద్ క్లీన్బౌల్డ్ చేశాడు. కానీ అభిషేక్ శర్మ (29; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో సన్రైజర్స్ పవర్ప్లేలో 56 పరుగులు చేసింది.

రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో అభిషేక్ వరుసగా రెండు సిక్సర్లు సాధించాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లు పుంజుకున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. అభిషేక్, హెన్రిచ్ క్లాసెన్ (24; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (17; 19 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. దీంతో 14.4 ఓవర్లకు హైదరాబాద్ 114 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన అబ్దుల్ సమద్తో షాబాజ్ అహ్మద్ (22; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వారిద్దరు బ్యాటు ఝుళిపించి సన్రైజర్స్కు పోరాడే స్కోరు అందించాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు, అజ్మతుల్లా, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ఆఖరి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యాడు.