Punjab Kings: పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచ్లల్లో ఓడిన ఈ జట్టు గుజరాత్ టైటాన్స్పై అదరగొట్టింది. భారీ టార్గెట్ను ఛేదించింది. హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది. నాలుగు మ్యాచ్లల్లో రెండింట విజయాలను అందుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది పంజాబ్. మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 199 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేసిన కేప్టెన్ శుభ్మన్ గిల్.. టాప్ స్కోరర్.

అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు.. ఇంకా ఒక్క బంతి మిగిలివుండగానే ఈ టార్గెట్ను కొట్టిపడేశారు. 19.5 ఓవర్లల్లో 200 పరుగులు చేశారు. రెండు వరుస ఓటముల తరువాత గుజరాత్ టైటాన్స్ను వారి సొంత గడ్డపై ఓడించారు. ప్రత్యేకించి- డెత్ ఓవర్లల్లో విజృంభించి ఆడారు.
ఈ మ్యాచ్లో భారత్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లు శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, అశుతోష్ రాణా అదరగొట్టారు. మ్యాచ్ గెలిచిందంటే వారి చలవే. శశాంక్ సింగ్- 29 బంతుల్లోనే 61, ప్రభ్సిమ్రాన్ సింగ్- 24 బంతుల్లో 35, అశుతోష్ రాణా- 17 బంతుల్లో 31 పరుగులు చేశారు. మ్యాచ్ను గెలిపించారు.
ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ ఓ సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 200లు, అంతకంటే ఎక్కువ పరుగుల టార్గెట్ను అత్యధికసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. మొత్తంగా ఆరు సార్లు 200+ పరుగుల టార్గెట్ను అందుకున్న జట్టుగా నిలిచింది. 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఈ తరహా రికార్డును సాధించింది పంజాబ్ కింగ్స్ మాత్రమే.
ఇలాంటి రికార్డ్ మరే జట్టుకూ లేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గానీ, ముంబై ఇండియన్స్ గానీ ఇలాంటి రికార్డునొకదాన్ని ఇప్పటిదాకా సృష్టించలేకపోయాయి. ఒక్కసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్గా నిలవనప్పటికీ.. పంజాబ్ కింగ్స్ మాత్రం తన ఆటతీరుతో అదరగొడుతోంది.