Shashank Singh: పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచ్లల్లో ఓడిన ఈ జట్టు గుజరాత్ టైటాన్స్పై అదరగొట్టింది. భారీ టార్గెట్ను ఛేదించింది. హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది. నాలుగు మ్యాచ్లల్లో రెండింట విజయాలను అందుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది పంజాబ్. మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 199 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేసిన కేప్టెన్ శుభ్మన్ గిల్.. టాప్ స్కోరర్.

అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు.. ఇంకా ఒక్క బంతి మిగిలివుండగానే ఈ టార్గెట్ను కొట్టిపడేశారు. 19.5 ఓవర్లల్లో 200 పరుగులు చేశారు. రెండు వరుస ఓటముల తరువాత గుజరాత్ టైటాన్స్ను వారి సొంత గడ్డపై ఓడించారు. ప్రత్యేకించి- డెత్ ఓవర్లల్లో విజృంభించి ఆడారు.
ఈ మ్యాచ్లో భారత్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లు తళుక్కున మెరిశారు. బ్యాటింగ్లో అదరగొట్టారు. పంజాబ్ కింగ్స్.. ఈ విజయాన్ని అందుకోగలిగిందంటే దానికి కారణం అన్క్యాప్డ్ ప్లేయర్లే. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న సీనియర్లు విఫలమైన చోట.. వీళ్లు చెలరేగారు. సత్తా చాటారు.
ప్రత్యేకించి శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లో దుమ్ము దులిపాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన శశాంక్.. 29 బంతుల్లోనే 61 పరుగులు పిండుకున్నాడు బౌలర్ల నుంచి. నాటౌట్గా నిలిచాడు. ఇందులో నాలుగు భారీ సిక్సర్లు, ఆరు బుల్లెట్లవంటి ఫోర్లు ఉన్నాయి.
టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 24 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో 35 పరుగులు చేశాడు. రన్ రేట్ దిగజారకుండా చూసుకోగలిగాడు. చివరి ఓవర్లల్లో అశుతోష్ రాణా సునామీ ఇన్నింగ్ ఆడాడు. 17 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురూ కూడా అన్ క్యాప్డ్ ప్లేయర్లే.