ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ గొడవకు ముగింపు లభించట్లేదు. హార్దిక్ పాండ్యపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్కు ముంబై జట్టు పగ్గాలు అందించడాన్ని హిట్ మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండయన్స్తో జరిగిన మ్యాచ్.. రోహిత్ అభిమానులను మరింత బాధపెట్టింది. ఈ పోరులో రోహిత్కు గౌరవం ఇవ్వకుండా హార్దిక్ ప్రవర్తించాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
రోహిత్ సలహాలను తీసుకోవడానికి హార్దిక్ కొంచెం కూడా ఇష్టపడలేదని అంటున్నారు. అంతేగాక రోహిత్ను ఉద్దేశపూర్వకంగా బౌండరీ లైన్ వద్ద హార్దిక్ ఫీల్డింగ్ చేయించాడని పేర్కొంటున్నారు.

సీనియర్లకు గౌరవం ఎలా ఇవ్వాలో రుతురాజ్ గైక్వాడ్ను చూసి హార్దిక్ పాండ్య నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ ధోనీ సలహాలతో రుతురాజ్ ఫీల్డింగ్ సెట్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. గుజరాత్ మ్యాచ్లో రోహిత్ వీడియోలకు ఎమోషనల్ సాంగ్స్ జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీటికి విశేషాదరణ లభిస్తోంది. మరోవైపు హార్దిక్ను ట్రోల్ చేస్తూ ఫన్నీ మీమ్ వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు.
అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు. గుజరాత్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. అజ్మతుల్లా, ఉమేశ్ యాదవ్, జాన్సన్, మోహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.