ఐపీఎల్ ప్రారంభంకాక ముందే లీగ్ సెగ మొదలైంది. ఆటగాళ్లు, జట్ల గురించి క్రికెట్ విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్తో కొంతమంది స్టార్ ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు ఆటకు దూరమై చాలా కాలం అవుతుంది. ఐపీఎల్తోనే వాళ్ల పునరాగమనం ఉంటుంది.
ఐపీఎల్ మాత్రమే ఆడే ధోనీని మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా వివిధ కారణాలతో టీమిండియాకు దూరమయ్యారు.అయితే అందరి చూపు రిషభ్ పంత్ పైనే ఉంది. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఇప్పటివరకు పోటీ క్రికెట్ మళ్లీ ఆడలేదు. ఐపీఎల్-2024తోనే తిరిగి మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో పంత్ ఫిట్నెస్, ఫామ్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో పంత్ గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.

పూర్తి ఫిట్నెస్ సాధిస్తే పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ సారథి బాధ్యతలు అందివ్వాలని గవాస్కర్ సూచించాడు. అలాగే పంత్కు కుదురుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలని, మునపటి పంత్ను ఆశించొద్దని పేర్కొన్నాడు. ''పంత్ పూర్తి ఫిట్నెస్తో తిరిగొస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు అతడికే ఇవ్వాలి. అదే జరగాలనుకుంటున్నా. ఫిట్నెస్ సాధించి తిరిగొస్తున్న పంత్కు ఇదే తొలి సీజన్. కాబట్టి హడావిడి చేయొద్దు. కుదురుకోవడానికి సమయం ఇవ్వాలి''
''బ్యాటింగ్, వికెట్ కీపింగ్లో మోకాలు ప్రధానపాత్ర వహిస్తోంది. పునరాగమం ప్రారంభంలో ఆ రెండింటిని పంత్ చేయకపోవచ్చు. అయితే మునపటి పంత్ను మనం చూడలేం . అతడికి నేను కూడా వీరాభిమానినే. నా దృష్ట్యా అతడు ఆరోగ్యంగా ఉండటమే నా మొదటి ప్రాధాన్యత. అప్పుడే అతడు తిరిగొచ్చి, మనల్ని అలరించగలడు. ఇది పంత్కు కష్టతరమే. బ్యాటింగ్లో తన లయను అందుకోవడానికి పంత్కు కాస్త సమయం ఇవ్వాలి. మంచి విషయం ఏంటంటే.. పంత్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
ప్రమాదంలో పంత్ మోకాలికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. కాగా, మార్చి 23న ఢిల్లీ క్యాపిల్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.