ఐపీఎల్-2024లో ఆటతో పాటు ఇతర విషయాలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి. కెప్టెన్సీ మార్పు ఈ సీజన్లో హాట్ టాపిక్గా మారింది. లీగ్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ కొత్త సారథులను ప్రకటించాయి. ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ ప్లేస్లో హార్దిక్ పాండ్య జట్టు పగ్గాలు అందుకున్నారు.
ధోనీ, రోహిత్ ఇద్దరూ చెరో అయిదు టైటిళ్లు అందించారు. కానీ కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఇరు జట్లలో ఒకేరీతిలో జరగలేదు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా, రోహిత్ను తప్పించారని వార్తలు వచ్చాయి. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో ఐక్యత దెబ్బతిందని, టీమ్ రెండు వర్గాలు చీలిపోయిందని కథనాలు వచ్చాయి. అంతేగాక ఈ సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబైను వీడనున్నాడని, ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముంబై ఇండియన్స్ ఒప్పుకుంటే రోహిత్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని లాంగర్ పేర్కొన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు లక్నో కోచ్ ఎంతో సంతోషంతో ఈ వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందంటే..
'నేను ఓ ఆటగాడిని జట్టులోకి తీసుకురావాలని భావిస్తే.. నేను ఎవరి గురించి ఆలోచిస్తానని అనుకుంటున్నారు?' అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో జస్టిన్ లాంగర్ అడిగాడు. దానికి ఆ వ్యక్తి 'లక్నో సూపర్ జెయింట్స్లో అన్ని విభాగాలు పటిష్టంగానే ఉన్నాయి. అయితే రోహిత్ శర్మను తీసుకురావాలని చూస్తున్నారా?' అని బదులిచ్చాడు. దీనికి జస్టిన్ లాంగర్.. 'రోహిత్ శర్మ? ముంబై ఇండియన్స్ నుంచి తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు మధ్యవర్తిగా ఉండి మాట్లాడండి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
కాగా, ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడగా మూడింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.