Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి కీలక అప్డేట్ దొరికింది. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న సౌరవ్ గంగూలీ ఈ అప్డేట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో పంత్ ఆడతాడని వెల్లడించాడు. గతేడాది డిసెంబరులో ఇంటికి వెళ్తుండగా రిషభ్ కారుకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పంత్ ఆటకు దూరమయ్యాడు.
ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో చేరిన అతను రిహాబిలేషన్లో ఉన్నాడు. ఈ క్రమంలో వైద్యులు కూడా పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. అయితే ఈ ప్రమాదం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్, ఐపీఎల్ 2023, గతేడాది టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ దేనీలోనూ పంత్ ఆడలేకపోయాడు. ఫ్యాన్స్ మాత్రం పంత్ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే గంగూలీ ఇచ్చిన అప్డేట్.. ఫ్యాన్స్ను తెగ సంతోషపెడుతోంది. వచ్చే ఏడాది ఐపీఎల్లో పంత్ ఆడుతున్నాడని గంగూలీ స్పష్టం చేయడంతో తమకు చెప్పలేని ఆనందం కలుగుతోందని వాళ్లు అంటున్నారు. ఈ ఏడాది పంత్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా పేలవ ప్రదర్శన చేసింది. జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు.
'రిషభ్ పంత్ మంచి షేప్లో ఉన్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో అతను మళ్లీ ఆడతాడు. ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయడం లేదు. నవంబరు 11 వరకు మాతోనే కోల్కతాలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ కదా.. అందుకే అతనితో జట్టు గురించి కొంచెం చర్చించాం. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మాట్లాడుకున్నాం' అని గంగూలీ చెప్పాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కోల్కతాలో నిర్వహించిన ఈ ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొనేందుకు పంత్ కూడా వచ్చాడు. అయితే అతను ప్రాక్టీస్లో పాల్గొనలేదు. జట్టుతో కలిసి ట్రావెల్ చేశాడంతే. ఈ క్యాంప్లో కూడా పంత్ నడవడానికి కొంత ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.