రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి నిరాశే మిగిలింది. ఈ సాలా కప్ నమదే అంటూ కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2024లో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిపాలైంది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తేడాతో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ట్రోఫీ సాధించకుండా 17వ సీజన్ను ముగించింది. అయితే ఈ సీజన్ ఆరంభంలోనే ఆర్సీబీ పనైపోయిందని భావించారంతా. తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఒక్క విజయమే బెంగళూరు సాధించింది. కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్కు చేరింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది.

రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో, 2x4, 2x6), విరాట్ కోహ్లి (33; 24 బంతుల్లో, 3x4, 1x6), మహిపాల్ లోమ్రర్ (32; 17 బంతుల్లో, 2x4, 2x6) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/44) మూడు, అశ్విన్ (2/19) రెండు వికెట్లు తీశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45; 30 బంతుల్లో, 8x4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో, 2x4, 2x6), హెట్మెయిర్ (26; 14 బంతుల్లో, 3x4, 1x6) విజయంలో కీలక పాత్ర పోషించారు.
అయితే ఐపీఎల్-2024లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ మాక్స్వెల్ అట్టర్ఫ్లాప్ అయ్యాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో అయినా జట్టును ఆదుకుంటాడనుకుంటే డకౌటయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో మొదటి బంతికే షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. ఈ సీజన్లో ఏకంగా నాలుగు సార్లు డకౌవ్వడం గమనార్హం. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఓ సీజన్లో అత్కధిక సార్లు డకౌటైన ప్లేయర్గా, అలాగే లీగ్లో ఓవరాల్గా అత్యధిక సార్లు ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరిన ఆటగాడిగా దినేశ్ కార్తీక్ (18)తో సమంగా రికార్డులకెక్కాడు.
ఈ నేపథ్యంలో మాక్సీపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. మాక్స్వెల్ వల్ల ఈ సీజన్లో ఉపమోగమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం మాక్సీ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేశారు. 'మాక్స్వెల్ ఏం చేస్తున్నాడు?' అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ.. మాక్సీకి అసలు ఏమైందని, కీలక మ్యాచ్ల్లో ప్రధాన ఆటగాళ్లు సత్తాచాటాలని, కానీ మాక్సీ నిరాశపరిచాడని అన్నాడు. మాక్స్వెల్ నుంచి ఇలాంటి ప్రదర్శన సరిపోదని పేర్కొన్నాడు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన మాక్సీ 5 సగటుతో 52 పరుగులు చేశాడు.