ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమై పది రోజులు గడిచింది. మెగా లీగ్ నుంచి ఆశించిన మజా ఫ్యాన్స్కు అందుతోంది. ఊహించినట్లుగానే పరుగులు వరద, వికెట్ల వేటతో లీగ్ సందడిగా సాగుతోంది. వింటేజ్ ధోనీ షో, విరాట్ కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్లు, రోహిత్ మాస్ బ్యాటింగ్తో పాటు క్లాసెన్, రసెల్ విధ్వంసాలతో ఐపీఎల్ టాప్లో దూసుకెళ్తోంది.
అయితే ఎప్పటిలానే అత్యంత ధర పలికిన ఆటగాళ్లు నిరాశపరుస్తున్నారు. కాస్ట్లీ ప్లేయర్స్ ఫ్లాప్ అవ్వడం ఐపీఎల్లో కామన్ మ్యాటరే. ఆ ఆనవాయితీని ఈ సీజన్లోనూ కొనసాగిస్తున్నారు. దీంతో అనవసరంగా రూ.కోట్లు కుమ్మరించామని ఫ్రాంచైజీలు మరోసారి బాధ పడుతున్నాయి. తుదిజట్టులో కొనసాగించలేక, బెంచ్కు పరిమితం కాలేక ఫ్రాంచైజీ తలలు పట్టుకుంటున్నాయి. ఈ సారి వేలంలో భారీ ధర సొంతం చేసుకుని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

పాపం.. కేకేఆర్
కేకేఆర్ బాధ వర్ణనాతీతం. మిచెల్ స్టార్క్ను రికార్డు ధరకు కోల్కతా సొంతం చేసుకుంది. ఈ ఆస్ట్రేలియా పేసర్ కోసం రూ.24.75 కోట్లు కుమ్మరించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి పలికిన అత్యంత గరిష్ఠ ధర ఇదే. కానీ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడిన స్టార్క్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేదు. కనీసం పొదుపుగా కూడా బౌలింగ్ చేయలేదు. ఎనిమిది ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకుని సెంచరీ కొట్టేశాడు.
అల్జారీని అనొద్దు.. తప్పు ఆర్సీబీదే
వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ను ఆర్సీబీ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ధారాళంగా పరుగులు సమర్పిస్తాడని తెలిసి కూడా అతడి కోసం భారీగా వెచ్చించడంపై వేలం తర్వాత బెంగళూరు యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసి ఈ సీజన్లో అల్జారీ జోసెఫ్ అదరగొడతాడనుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్కు నిరాశే మిగిలింది. సీఎస్కే మ్యాచ్లో 3.4 ఓవర్లలో 38 పరుగులు, పంజాబ్ పోరులో 4 ఓవర్లకు 43, కేకేఆర్ మ్యాచ్లో 2 ఓవర్లకు ఏకంగా 34 పరుగులు అల్జారీ సమర్పించుకున్నాడు. మేనేజ్మెంట్కు ఓదార్పులా ఓ వికెట్ తీశాడు.
హర్షల్ ఫ్లాప్ షో
ఈ సీజన్ వేలంలో అత్యంత భారీ ధర పలికిన భారత ఆటగాడు హర్షల్ పటేల్. అతడి కోసం పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లు కుమ్మరించింది. కానీ హర్షల్ ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో 47 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్ వేసి హర్షల్ 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ల్లో 45-45 పరుగులు ఇచ్చాడు. బెంగళూరుపై ఓ వికెట్ సాధించాడు. మూడు మ్యాచ్ల్లో మూడు వికెట్లు సాధించినప్పటికీ 10 ఎకానమీ రేటుతో హర్షల్ బౌలింగ్ చేస్తున్నాడు.
స్పెన్సర్ జాన్సన్ కోసం గుజరాత్ టైటాన్స్ రూ.10 కోట్లు వెచ్చించింది. తొలి రెండు మ్యాచ్ల్లో జాన్సన్కు అవకాశం ఇచ్చింది. కానీ అతడి ప్రదర్శన సాధారణంగా ఉండటంతో మూడో మ్యాచ్కు అతడిని పక్కనపెట్టింది. మరోవైపు రూ.20.50 కోట్లు పలికిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచ్లో నిరాశపరిచినా తర్వాత పుంజుకున్నాడు. అతని ధరకు కాస్త న్యాయం చేస్తున్నాడు. భారీ ధర పలికిన మిగిలిన ఆటగాళ్లకు ఇంకా పెద్దగా అవకాశాలు రాలేదు.