IPL 2024: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాది మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ముంబై వదిలేసింది. ఏకంగా అతని కోసం రూ.17.5 కోట్లు ఖర్చు పెట్టింది ముంబై ఇండియన్స్. మంచి ఎత్తుగా ఉండే గ్రీన్.. తన పవర్ గేమ్తో అందర్నీ ఆకర్షించాడు.
అవసరం అయితే బంతితోనూ జట్టును ఆదుకోగల సత్తా అతనికి ఉంది. అందుకే అతని కోసం ముంబై అంత ఖర్చు పెట్టింది. కానీ ఒక్క సీజన్ తర్వాతనే అతన్ని వదిలేసింది. అయితే హార్దిక్ పాండ్యా కోసం గ్రీన్ను వదిలేయడంతో ఫ్యాన్స్ కూడా ఏమీ అనలేకపోతున్నారు. పాండ్యా రీఎంట్రీతో ముంబై ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. అయితే గ్రీన్ను తీసుకోవడం ఆర్సీబీకి కూడా కలిసొచ్చే నిర్ణయంలాగే కనిపిస్తోంది.

గతేడాది తొలిసారి ఐపీఎల్ ఆడిన గ్రీన్.. ముంబై తరఫున అంత గొప్పగా రాణించలేదు. కానీ కొన్ని మ్యాచుల్లో కీలకమైన ఇన్నింగ్సులు ఆడాడీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఈ క్రమంలో అతన్ని తీసుకోవడం ఆర్సీబీకి చాలా కలిసొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మిడిలార్డర్లో బ్యాటుతో రాణించడంతోపాటు, అవసరమైతే బంతితో కూడా ప్రధాన పేసర్ బాధ్యత పోషించగల సత్తా గ్రీన్కు ఉంది.
అందుకే చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో గ్రీన్ కచ్చితంగా ఆర్సీబీకీ బలంగా మారతాడని అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా మంచి అనుభవం సంపాదించిన గ్రీన్.. ఐపీఎల్లో కూడా తన మార్కు చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇలాంటి సమయంలో అతని కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి కూడా చిన్నస్వామి వంటి బ్యాటింగ్ పిచ్ ఉపయోగపడే అవకాశం ఉంది.
గ్రీన్ చేరికతో ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా తయారయ్యే అవకాశం ఉంది. దానికితోడు సిరాజ్కు అండగా మంచి పేసర్ కూడా జట్టులో చేరినట్లయింది. గ్రీన్ కనుక తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే.. కచ్చితంగా అతను ఆర్సీబీకి కీలకంగా మారతాడు. మరి అతను ఈ ఐపీఎల్లో ఏమాత్రం ఆడతాడో చూడాలి.