Rajinikanth: ఐపీఎల్ 2024 సీజన్ అంచనాలకు అందట్లేదు. అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 50- ఓవర్ల ఫార్మట్ తరహాలో మ్యాచ్లు సాగుతున్నాయి. ప్రత్యేకించి.. సన్రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు ఆటతీరుకు హద్దులు ఉండట్లేదు. టీ20 గేమ్లో ఉండే హద్దులన్నింటినీ చెరిపేసింది. ఈ జట్టు 250కి పైగా స్కోర్ను నమోదు చేస్తోందంటే నమ్మశక్యం కావట్లేదు క్రికెట్ పండితులకు.
శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏ స్థాయిలో రెచ్చిపోయిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. చివరి రెండు మ్యాచ్లను రిపీట్ చూపించింది. ఆ రెండు మ్యాచ్ల హైలైట్స్ను చూస్తోన్నామనే ఫీలింగ్ను కలిగించింది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల్లో 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్- 32 బంతుల్లో 69, అభిషేక్ శర్మ- 12 బంతుల్లో 46 పరుగులు చేశారు. మిడిలార్డర్లో నితీష్ కుమార్ రెడ్డి- 27 బంతుల్లో 37, షాబాజ్ అహ్మద్- 29 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కేపిటల్స్- ఈ స్కోర్ను అందుకోలేకపోయింది. 199 పరుగుల వద్దే దాని ప్రస్థానం నిలిచిపోయింది.
సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది వరుసగా నాలుగో విజయం. ఏకంగా 67 పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ను ఓడించడం వల్ల ఆ జట్టు నెట్ రన్రేట్ భారీగా పెరిగింది. మ్యాచ్ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కనిపించిన ఈ ఆరెంజ్ ఆర్మీ.. మ్యాచ్ ముగిసే సమయానికి రెండో స్థానానికి ఎగబాకింది.
ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో అయిదింట్లో విజయబావుటా ఎగురవేసింది సన్రైజర్స్ టీమ్. ప్రస్తుతం 10 పాయింట్ల ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. అటు ప్లే ఆఫ్స్కు కూడా మరింత చేరువ అయింది. ఇక తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 25వ తేదీన ఆడబోతోంది. తన హోమ్ పిచ్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టబోతోంది.
ఈ స్థాయిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాలను సాధిస్తోండటం వల్ల మోస్ట్ హ్యాపియెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆ జట్టు ఓనర్ కావ్యా మారనే. కిందటి సీజన్ వరకూ ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంది హైదరాబాద్. అవమానకర ఓటములను ఎదుర్కొంది. 2023 సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున అంటే 10వ స్థానానికి నిలిచింది.
సన్రైజర్స్ ఓడిన ప్రతీసారీ కావ్యా మారన్.. స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తూనే వచ్చాం. ఈ దృశ్యాలు చివరికి సూపర్ స్టార్ రజినీకాంత్ను సైతం కదిలించిన విషయం తెలిసిందే. కావ్య మారన్ బాధ చూడలేకపోతున్నానంటూ జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో వ్యాఖ్యానించారాయన. ఆమె దుఖాన్ని చూడలేక ఛానల్ కూడా మార్చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
మంచి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని, మెరుగైన ఆటగాళ్లను తీసుకోవాలని, జట్టును బలోపేతం చేసుకోవాలంటూ అప్పట్లో రజినీకాంత్.. కళానిధి మారన్కు సలహా కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మాటల ప్రభావమో ఏమో గానీ.. ఈ సీజన్లో మాత్రం సన్రైజర్స్ తన ప్రతాపాన్ని చూపుతోంది. జట్టు విజయాలు సాధించినప్పుడు కావ్యా మారన్ సంతోషంతో చిందులేస్తోంది. కావ్యా మారన్ను సంతోషంగా చూడాలనే రజినీకాంత్ కోరిక తీరినట్టయింది.