Sanju Samson: ఐపీఎల్ 2024 సీజన్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు చతికిల పడుతోంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్కు చేరుకునే ఈ దశలో బోల్తా కొడుతోంది. బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్లల్లో పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో టాప్ పొజీషన్ నుంచి కిందికి దిగింది.
తన చివరి రెండు మ్యాచ్లల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ చేతిల్లో మట్టి కరిచింది సంజు శాంసన్ సేన. మంగళవారం రాత్రి ఢిల్లీ అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. 20 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ పోరెల్- 65, ట్రిస్టన్ స్టబ్స్- 41 రాణించడంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అనంతరం ఛేజింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడింది గానీ.. 201 పరుగుల వద్దే నిలిచి పోయింది దాని ప్రస్థానం.
సంజు శాంసన్ అవుట్ అయిన విధానం దుమారం రేపింది. ఇన్నింగ్ 16వ ఓవర్ నాలుగో బంతికి అతను అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే పొంచివున్న షై హోప్.. ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్ను టచ్ అయ్యాయనేది వాదన.
దీనిపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ నవ్జోత్ సింగ్ సిద్ధు రియాక్ట్ అయ్యాడు. ఈ ఎపిసోడ్లో సంజుకు అండగా నిలిచాడు. క్యాచ్ అందుకున్నప్పుడు ఫీల్డర్ షై హోప్ పాదాలు బౌలింగ్ రోప్ను తాకాయని తేల్చి చెప్పాడు. బంతి చేతిలో ఉండగానే ఒకటి కాదు రెండుసార్లు అతను రోప్ను టచ్ చేశాడని అన్నాడు.
సంజు శాంసన్ అవుట్ కావడం మ్యాచ్ దిశను మార్చివేసిందని సిద్ధు అన్నాడు. అదసలు అవుటే కాదనీ వ్యాఖ్యానించాడు. సైడ్-ఆన్ కోణంలో చూస్తే, ఫీల్డర్ షూస్ రెండుసార్లు బౌండరీని తాకినట్లు చాలా స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నాడు. టెక్నాలజీ తప్పుగా ఉంటే దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
రీప్లేలో కూడా ఫీల్డర్.. బౌండరీ లైన్ను టచ్ చేసినట్లు మన కంటికి స్పష్టం కనిపిస్తోన్నప్పుడు ఇక టెక్నాలజీ మీద ఆధార పడాల్సిన అవసరం లేదని సిద్ధు వ్యాఖ్యానించాడు. ఇదివరకు కోల్కత నైట్రైడర్స్పై విరాట్ కోహ్లీ నో బాల్కు అవుట్ అయిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా సిద్ధు గుర్తు చేశాడు.
నడుం కంటే ఎత్తుగా వచ్చిన బంతిని ఆడి ఆ మ్యాచ్లో కోహ్లీ అవుట్ అయిన విషయం తెలిసిందే. అంపైర్ ఉద్దేశపూరకంగా అవుట్ ఇచ్చి ఉండకపోవచ్చని, తప్పు టెక్నాలజీదే అయినప్పుడు ఎవరేం చేయగలరని చెప్పాడు సిద్ధం.