Rishabh Pant: ఐపీఎల్ 2024 సీజన్లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్తోనే తన జైత్రయాత్రను ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించి.. తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
నేడు డబుల్ హెడ్డర్స్. వీకెండ్ అయినందున రెండు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్ ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగనుంది. ఢిల్లీ కేపిటల్స్తో తలపడబోతోంది పంజాబ్ కింగ్స్. పంజాబ్ ముల్లాన్పూర్లో గల మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం దీనికి వేదిక. సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కత నైట్రైడర్స్ మధ్య సెకెండ్ గేమ్ ఈ సాయంత్రం 7: 30 గంటలకు మొదలవుతుంది. కోల్కత ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

ఢిల్లీ కేపిటల్స్కు ఈ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకం. ఓ భావోద్వేగంతో కూడుకున్న గేమ్ ఇది. ఎందుకంటే- సుదీర్ఘ విరామం తరువాత రిషభ్ పంత్ మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోన్నాడు. అతని సెకెండ్ ఇన్నింగ్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ను గెలిచి అతనికి గిఫ్ట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది ఢిల్లీ కేపిటల్స్.
14 నెలల పాటు అంటే 453 రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు రిషభ్ పంత్. 2022 డిసెంబర్ 30వ తేదీన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మరణం అంచుల్లో నుంచి బయట పడ్డాడు. అతను ప్రయాణించిన కారు రోడ్డు డివైడర్ను ఢీ కొట్టి.. దగ్ధమైంది. కారులో ఇరుక్కున్న రిషభ్ పంత్ను కొందరు వాహనదారులు రక్షించారు.
అప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నాడు పంత్. సుమారు ఆరు నెలల పాటు కాలు కింద పెట్టలేని స్థితిలో గడిపాడు. బీసీసీఐ అతనికి నాణ్యమైన వైద్య చికిత్సను అందించింది. ఆ తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలేటషన్లో ఉన్నాడు. పూర్తిగా కోలుకున్నాడు. దీనితో ఐపీఎల్ మ్యాచ్ను ఆడటానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.