DC vs MI: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది. శనివారం సాయంత్రం ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడింది. 10 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆవకాశాలకు దాదాపుగా తెర పడినట్టయింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. అనంతరం ఛేజింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ చిట్టచివరి వరకూ పోరాడింది. హైదరాబాదీ తిలక్ వర్మ 32 బంతుల్లో 63, కేప్టెన్ హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 46, లోయర్ ఆర్డర్లో టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులతో రాణించినప్పటికీ దాన్ని విజయంగా మలచుకోలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగలిగింది ముంబై ఇండియన్స్.

కాగా- ఈ ఓటమికి తిలక్ వర్మే కారకుడని తేల్చేశాడు హార్దిక్ పాండ్యా. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడాడు. ఓటమికి గల కారణాలను వివరించాడు. మిడిల్ ఓవర్లల్లో ఇంకా ధాటిగా ఆడి ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు. అక్షర్ పటేల్.. తిలక్ వర్మను కట్టుదిట్టంగా బంతులు వేశాడని పేర్కొన్నాడు. తిలక్ వర్మకు చక్కగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు.
లెఫ్ట్ హ్యాండర్ అయిన తిలక్ వర్మ భారీ షాట్లు ఆడకుండా అతనిపై అక్షర్ పటేల్ను ప్రయోగించడం బెస్ట్ ఛాయిస్గా చెప్పుకొచ్చాడు. గేమ్పై అవగాహన పెంచుకోలేకపోయామని, ఎప్పుడెలా ఆడాలనే విషయంపై స్పష్టతను తాము కోల్పోయామని అన్నాడు. ఫలితంగా మ్యాచ్ను ఓడిపోవాల్సి వచ్చిందని అన్నాడు.
తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులు చేసినప్పటికీ.. క్రీజ్లో నిలదొక్కుకునే క్రమంలో నెమ్మదిగా ఆడిన విషయం తెలిసిందే. 10 బంతుల్లో 10 పరుగులే చేశాడు ఓ దశలో. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత అక్షర్ పటేల్ బౌలింగ్లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించడంతో గేర్ మార్చినట్టయింది.