ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు షాక్ తగిలింది. పంత్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ ఈ ఫైన్ విధించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న రెండో కెప్టెన్గా పంత్ నిలిచాడు.
పంత్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫైన్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గిల్కు కూడా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ జరిమానా విధించడం గమనార్హం. ఐపీఎల్ నియమావళి ప్రకారం నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయకపోతే ఆ సదరు జట్టు కెప్టెన్పై మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ టీమ్కు ఇదే తొలి విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో, 5×4, 3×6), రిషబ్ పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) సత్తాచాటారు. పతిరన (3/31) మూడు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో, 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (37*; 16 బంతుల్లో, 4×4, 3×6) పోరాడారు. ముకేశ్ కుమార్ (3/21) మూడు, ఖలీల్ అహ్మద్ (2/21) రెండు వికెట్లతో సీఎస్కేను దెబ్బ కొట్టారు. కాగా, వైజాగ్ వేదికగానే బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.