వైజాగ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి గెలుపు. మొదటి రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే సీఎస్కేపై సాధించిన విజయంలో జట్టుకూర్పు కూడా కీలక పాత్ర పోషించింది. ఓపెనర్ పృథ్వీ షా జట్టులోకి వచ్చాడు. 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.
అయితే పృథ్వీ షా సత్తాచాటడానికి అతనిలో ఉన్న బాధనే కారణమని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. బెంచ్కే పరిమితం చేయడంలో అతని కసిగా రగిలిపోయాడని తెలిపాడు. ''తమ ప్లేయర్ రిథమ్లో ఉన్నాడా లేదా అని ప్రతి టీమ్ మేనేజ్మెంట్ నెట్స్లో పరిశీలిస్తుంటుంది. కాగా, పృథ్వీ షాకు ఈ ఇన్నింగ్స్ చాలా ముఖ్యం. గత ఐపీఎల్ సీజన్లో అతడు ఎన్నో మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ సీజన్లోనూ తొలి రెండు మ్యాచ్లకు అతడు బెంచ్కు పరిమితమయ్యాడు. ఈ విషయం అతడిని చాలా బాధపెట్టి ఉంటుంది. అందుకే అతడి నుంచి ఈ మంచి ఇన్నింగ్స్ వచ్చి ఉంటుంది'' అని సెహ్వాగ్ అన్నాడు.

మరోవైపు పృథ్వీ షాకు ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్కు తక్కువ అవకాశాలు ఇవ్వడానికి కారణం గణాంకాలు అని ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ''గత కొన్ని సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన సమస్య ఓపెనింగ్ భాగస్వామ్యం. అన్ని జట్ల కంటే తక్కువ సగటుతో పరుగులు చేసిన ఓపెనింగ్ జంట ఢిల్లీదే. అయితే డేవిడ్ వార్నర్ బాగానే ఆడాడు. కానీ వార్నర్తో వచ్చిన పార్టనర్యే సరిగ్గా ఆడలేదు. అందుకే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వలేదనకుంటా. కానీ ఇవాళ పృథ్వీ బాగా ఆడాడు'' అని వాట్సన్ పేర్కొన్నాడు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో, 5×4, 3×6), రిషబ్ పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) సత్తాచాటారు. పతిరన (3/31) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో, 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (37*; 16 బంతుల్లో, 4×4, 3×6) పోరాడారు.