ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ టీమ్కు ఇదే తొలి విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో, 5×4, 3×6), రిషబ్ పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) సత్తాచాటారు. పతిరన (3/31) మూడు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో, 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (37*; 16 బంతుల్లో, 4×4, 3×6) పోరాడారు. ముకేశ్ కుమార్ (3/21) మూడు, ఖలీల్ అహ్మద్ (2/21) రెండు వికెట్లతో సీఎస్కేను దెబ్బ కొట్టారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం విన్నింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ విజయానికి గల కారణాలు వివరించాడు. ఈ సీజన్లో ఆలస్యంగా అవకాశం దక్కించుకున్న పృథ్వీ షా గురించి మాట్లాడాడు. ఎట్టకేలకు తాను తిరిగి ఫామ్లోకి రావడం గురించి పంత్ స్పందించాడు.
''ఇవాళ మా బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. పృథ్వీ షా గత రెండు వారాల నుంచి ఎంతో కష్టపడుతున్నాడు. అతనికి అవకాశం ఇవ్వాలని మేం భావించాం. అతను అదరగొట్టాడు. ముకేశ్ కుమార్ ఆఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అతడితో ఆలస్యంగా బౌలింగ్ చేయించిన నిర్ణయం మ్యాచ్ను బట్టి తీసుకుంటాం''
''ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే.. కాస్త సమయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే గత కొంతకాలంగా నేను క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. కానీ నేను మ్యాచ్ గమనాన్ని మార్చగలననే విశ్వాసంతో ఉన్నాను. ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యాను. తిరిగొచ్చాను. ఇది నా జీవితాన్ని మళ్లీ పొందడం లాంటిది'' అని పంత్ పేర్కొన్నాడు. ముకేశ్ కుమార్కు 14వ ఓవర్లో తొలిసారి పంత్ బంతిని అందించాడు. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లే బౌలింగ్ వేసిన ముకేశ్ 21 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రహానె, సమీర్ రిజ్వీ, శివమ్ దూబెను ఔట్ చేశాడు.