విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో సీఎస్కేకు ఇదే తొలి ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో, 5×4, 3×6), రిషబ్ పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో, 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (37; 16 బంతుల్లో, 4×4, 3×6) పోరాడారు. ముకేశ్ కుమార్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో సీఎస్కేను దెబ్బ కొట్టారు. అయితే మ్యాచ్ ఓడినా సీఎస్కు అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్కు ఫిదా అయ్యారు. ఎన్నో రోజుల తర్వాత వింటేజ్ ధోనీని ఫ్యాన్స్ చూశారు.

ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా తన ఫ్యాన్స్ను అలరించాడు. రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు 15 నెలలు ఆటకు దూరమైన పంత్ ఎట్టకేలకు తిరిగి ఫామ్లోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచిన పంత్ వైజాగ్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో ధోనీ, పంత్ కమ్బ్యాక్ గురించి ధోనీ సతీమణి సాక్షి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేశారు.
'ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్దు అందుకుంటున్న ధోనీ ఫొటోను పోస్ట్ చేసి ఫన్నీ క్యాప్షన్ సాక్షి రాసుకొచ్చారు. ''ముందుగా రిషభ్ పంత్కు ఘన స్వాగతం. మ్యాచ్ను ఓడిపోయామని ధోనీకి ఇంకా తెలియిదనుకుంటా'' అని సాక్షి పేర్కొన్నారు. ఓటమి బాధ లేకుండా ధోనీ ఆనందంతో అవార్డు తీసుకోవడంతో సాక్షి ఇలా చమత్కరించారు. ధోనీ ఫ్యామిలీకి పంత్ సన్నిహితుడు. ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా ధోనీ కుటుంబంతోనే పంత్ సమయాన్ని గడుపుతుంటాడు. ప్రమాదం తర్వాత పంత్ రీఎంట్రీ ఇవ్వడంలో ధోనీ పాత్ర కూడా కీలకమే.