స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా అయిదు రికార్డులు బ్రేక్ చేశాడు. వికెట్ కీపర్-బ్యాటర్గా అరుదైన ఘనతలు సాధించాడు.రెగ్యులర్ క్రికెట్కు దూరమై కూడా 42 ఏళ్ల వయస్సులో ధోనీ ధనాధన్ బ్యాటింగ్తో రికార్డులు బద్దలుకొట్టడం విశేషం.
ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ 16 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో ధోనీ పలు రికార్డులు సాధించాడు. టీ20 క్రికెట్లో 7000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్గా ధోనీ చరిత్ర సృష్టించాడు.

ఓ ఓవర్లో 20 లేదా 20+ పరుగులను అత్యధిక సార్లు సాధించిన భారత క్రికెటర్గా ధోనీ చరిత్రకెక్కాడు. అలాగే 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ధోనీ రికార్డు సాధించాడు. అంతేగాక ఐపీఎల్లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. వికెట్ కీపర్గానూ మహీ స్పెషల్ రికార్దు అందుకున్నాడు. టీ20ల్లో 300 వికెట్ల సాధించడంలో భాగస్వామ్యమైన తొలి వికెట్ కీపర్గా అరుదైన ఘనత సాధించాడు.
ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్కు వచ్చిన ధోనీ ఒకే ఇన్నింగ్స్తో ఇన్ని రికార్డులు బ్రేక్ చేయడం విశేషం. సీఎస్కే ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ధోనీ బ్యాటింగ్కు రాని విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో, 5×4, 3×6), రిషబ్ పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) సత్తాచాటారు. పతిరన (3/31) మూడు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో, 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (37*; 16 బంతుల్లో, 4×4, 3×6) పోరాడారు. ముకేశ్ కుమార్ (3/21) మూడు, ఖలీల్ అహ్మద్ (2/21) రెండు వికెట్లతో సీఎస్కేను దెబ్బ కొట్టారు.