స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రెగ్యులర్ క్రికెట్కు దూరమై కూడా 42 ఏళ్ల వయస్సులో ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చూసి అభిమానులతో సహా మాజీలు ఫిదా అవుతున్నారు. వైజాగ్ వేదికగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 16 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయినప్పటికీ వింటేజ్ ధోనీని చూసిన అవకాశం రావడంతో సీఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ధోనీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ధోనీని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించాలని సీఎస్కే జట్టు యాజమాన్యాన్ని దిగ్గజ పేసర్ బ్రెట్ లీ కోరాడు.

'' ఇవాళ రాత్రి ధోనీ దుమ్ము దులిపాడు. బ్యాటింగ్ పరంగా ధోనీ నుంచి మరింత కోరుకుంటున్నా. అతను తానంతట తాను ముందుగా బ్యాటింగ్కు రావాలి. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికీ తన బ్రెయిన్ షార్ప్గా సూపర్గా పనిచేస్తోంది. సీఎస్కే..ప్లీజ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపండి'' అని బ్రెట్ లీ అన్నాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కూడా ధోనీని కొనియాడాడు. ''ధోనీ మంచి ఫామ్లో ఉన్నాడు. ధోనీని నుంచి ఇదే కదా మనం కోరుకునేది. ధోనీ పవర్, నైపుణ్యం చూసి బౌలర్లు ఒత్తిడిలో పడుతుంటారు. తమ ప్రణాళికలు అమలుపరచడంలో గందరగోళానికి గురవుతుంటారు. అవకాశం లేని సందర్భాల్లో కూడా ధోనీ తన సత్తా మ్యాచ్ను గెలిపించడం ఎన్నోసార్లు చూశాం. ఇవాళ రాత్రి ధోనీ ఆడిన షాట్లు అమోఘం. కవర్ మీదు సిక్సర్ బాదిన షాట్ అంత సులువు కాదు. కానీ ధోనీ ఇప్పటికీ సాధిస్తున్నాడు'' అని వాట్సన్ పేర్కొన్నాడు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో, 5×4, 3×6), రిషబ్ పంత్ (51; 32 బంతుల్లో 4×4, 3×6) పతిరన (3/31) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో చెన్నై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో, 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (37*; 16 బంతుల్లో, 4×4, 3×6) పోరాడారు. ముకేశ్ కుమార్ (3/21) మూడు, ఖలీల్ అహ్మద్ (2/21) రెండు వికెట్లతో సీఎస్కేను దెబ్బ కొట్టారు.