చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివమ్ దూబె విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చెపాక్ వేదికగా నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు.
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ దూబె ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఛేదనలో తొలుత నిదానంగా ఆడిన అతడు తర్వాత గేర్ మార్చి దూకుడుగా పరుగులు చేశాడు. 28 బంతుల్లో అజేయంగా 34 పరుగులు చేశాడు.
చెన్నై జట్టు కంటే ముందు శివమ్ దూబె ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు. కానీ అక్కడ అద్భుత ప్రదర్శనలు చేయలేకపోయాడు. కానీ సీఎస్కేలో అడుగుపెట్టిన తర్వాత చెలరేగుతున్నాడు. స్పిన్నర్లను కనికరం లేకుండా సిక్సర్లతో శిక్షిస్తున్నాడు. అయితే తనలో ఈ మార్పుకు కారణాలు దూబె వివరించాడు. సీఎస్కే ఇచ్చిన స్వేఛ్చతోనే ఇలా ఆడుతున్నానని గుజరాత్తో మ్యాచ్ అనంతరం దూబె తెలిపాడు.

''చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇతర ఫ్రాంచైజీల కంటే భిన్నమైనది. సీఎస్కే నాకు స్వేచ్ఛను ఇచ్చింది. వాళ్ల కోసం కొన్ని మ్యాచ్లను అయినా గెలిపించాలని కోరుకుంటున్నా.ఈ తరహాలోనే కష్టపడుతున్నా. అది నాకు మేలు చేస్తోంది. హై స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయమని మా జట్టు సూచించింది. నేనూ అదే కోరుకున్నా. ఇక గుజరాత్ బౌలర్లు షార్ట్ బాల్స్ వేస్తారని ముందే గ్రహించా. దానికి తగ్గట్లుగా సిద్ధమయ్యా'' అని దూబె పేర్కొన్నాడు.
విజయంలో కీలక పాత్ర పోషించిన దూబెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, చెపాక్ వేదికగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 63 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె (51; 23 బంతుల్లో),రచిన్ రవీంద్ర (46; 20 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37; 31 బంతుల్లో) పోరాడాడు. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్పాండే తలో రెండు వికెట్లు తీశారు.