ఐపీఎల్-2024 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన సీఎస్కే నాలుగు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, కేకేఆర్పై గెలిచిన చెన్నై అదే జోరులో రేపటి మ్యాచ్లనూ గెలవాలని పట్టుదలతో ఉంది.
ఆల్రౌండ్ షోతో సీఎస్కే విజయాలు సాధిస్తున్నప్పటికీ కొన్ని లోపాలు జట్టును కలవరపెడుతున్నాయి. విదేశీ బ్యాటర్లు ఫామ్ కోల్పోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇతర ఆటగాళ్లు సత్తాచాటడంతో గెలుపు బాటలో పయనిస్తున్నప్పటికీ కీలక మ్యాచ్ల్లో ఇది సవాలుగా మారుతుందని చెన్నై టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్లేఆఫ్స్కు చేరుకునే ముందే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రణాళికలు రచిస్తోంది.

డెవాన్ కాన్వే స్థానంలో ఓపెనర్గా వస్తున్న రచిన్ రవీంద్ర శుభారంభాన్ని అందిస్తున్నప్పటికీ పెద్దస్కోరుగా మలచలేకపోతున్నాడు. ఇక వేలంలో రూ. 14 కోట్లు మరీ వెచ్చించి సొంతం చేసుకున్న డారిల్ మిచెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అంచనాలు అందుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాడు.
దీంతో మిచెల్ స్థానంలో మొయిన్ అలీని తుదిజట్టులోకి తీసుకురావాలని జట్టు భావిస్తోంది. అలీ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు, స్పిన్ కూడా వేయగలడు. అతడు తుదిజట్టులోకి ఆది నుంచే రావాల్సింది. కానీ రైట్-లెఫ్ట్ బ్యాటర్ల కాంబినేషన్ కోసం ఇన్నిరోజులు అలీని పక్కనపెట్టారు. కాగా, ఐపీఎల్లో చెన్నై-లక్నో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా చెరో విజయం సాధించాయి. ఓ మ్యాచ్కు ఫలితం రాలేదు.
సీఎస్కే తుదిజట్టు (అంచనా)
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్