ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన చెన్నై రెండు మ్యాచ్లు గెలిచింది. ఆ రెండు విజయాలు హోమ్గ్రౌండ్లో దక్కినవే. అదే సెంటిమెంట్తో ఇవాళ సొంతమైదానంలో జరగనున్న కేకేఆర్ మ్యాచ్లోనూ నెగ్గాలని చెన్నై జట్టు పట్టుదలతో ఉంది.
అయితే సీఎస్కే తుదిజట్టులో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.14 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న డారిల్ మిచెల్ను తుదిజట్టును తప్పించాలని ప్లాన్ చేస్తోంది. అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది. ముస్తాఫిజుర్, పతిరన జట్టుకు అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత లేకపోవడంతో శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఫామ్లో ఉంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయ దుందుభి మోగించింది. అదే జోరును కొనసాగించి సీఎస్కేపై గెలవాలని కేకేఆర్ ఉవ్విళ్లూరుతోంది. రసెల్, సునిల్ నరైన్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసొస్తుంది. అయితే కోల్కతా తమ తుదిజట్టులో మార్పులు చేయాలని భావించట్లేదు. విన్నింగ్ టీమ్ కాంబినేషన్ కొనసాగించాలని చూస్తోంది.
కాగా, ఐపీఎల్ రికార్డుల్లో కేకేఆర్పై సీఎస్కే పైచేయి సాధించింది. చెన్నై జట్టు 18, కోల్కతా 10 మ్యాచ్ల్లో గెలిచింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ల్లోనూ చెన్నైదే హవా. పది మ్యాచ్ల్లో సీఎస్కే ఏడు, కేకేఆర్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది.
సీఎస్కే తుదిజట్టు (అంచనా)
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానె, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, తీక్షణ
కేకేఆర్ తుదిజట్టు (అంచనా)
సునిల్ నరైన్, ఫిల్ సాల్ట్, రఘవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.