ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు.. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. జట్టు కేప్టెన్గా ఎంఎస్ ధోనీని తప్పించడం, అతని స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు పగ్గాలను అప్పగించడం కలకలం రేపుతోంది.
మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా చెన్నై సూపర్ కింగ్స్ను నిలిపిన ధోనీని కేప్టెన్ హోదా నుంచి తొలగించడం పట్ల విమర్శల సునామీ కొనసాగుతోంది. సరికొత్త వివాదానికి కేంద్రబిందువు అయింది. అతని హయాంలో ముంబై ఇండియన్స్తో సమానంగా అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచింది సీఎస్కే.

గత సీజన్లో జట్టుకు కప్ను అందించిన ధోనీ.. ఇప్పుడు కేప్టెన్గా లేడు. వికెట్ కీపర్ బ్యాటర్గా మాత్రమే ఆడబోతోన్నాడు. సీజన్ ఆరంభానికి ముందు అన్ని జట్ల కేప్టెన్ల ఫొటో షూట్ జరగడానికి చివరి నిమిషంలో ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించడాని చెబుతోంది సీఎస్కే మేనేజ్మెంట్. తనకు బదులుగా రుతురాజ్ గైక్వాడ్ను ఈ ఫొటో షూట్కు తానే దగ్గరుండి పంపించాడని వివరణ ఇస్తోంది.
ధోనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి సరైన కారణం అంటూ ఏదీ లేదు గానీ ఈ సీజన్ మొత్తానికీ ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. వయసు మీద పడటం, త్వరగా అలసి పోతోండటం, ఫిట్నెస్, గతంలో మెకాలికి సర్జరీ జరగడం.. వంటి సమస్యల వల్ల ధోనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చెబుతున్నారు.
కొన్ని మ్యాచ్లు ముగిసిన తరువాత ధోనీ విరామం తీసుకుంటాడని, స్వచ్ఛందంగా తుదిజట్టు నుంచి వైదొలగుతాడని, డగౌట్కే పరిమితం కావొచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. దీనిపై ఎట్టకేలకు మౌనం వీడింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్. వాటిని తోసిపుచ్చింది.
సీజన్ మొత్తానికీ ధోనీ అందుబాటులోనే ఉంటాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. తుదిజట్టులో ఉంటాడనీ అన్నారు. సీజన్ కొనసాగుతున్నప్పుడు అతన్ని పక్కన పెట్టాలనే ఉద్దేశం తమకు లేదనీ, విశ్రాంతీ తసుకోవాలని ధోనీ కూడా కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పష్టం చేశాడు. గత సీజన్ కంటే ధోనీ ఫిట్గా ఉన్నాడనీ అన్నాడు.