MS Dhoni: హైఓల్టేజ్ క్రికెట్ టోర్నమెంట్- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. 17వ ఎడిషన్ ఇది. ఈ రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
చెన్నై చెపాక్లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. హోమ్ పిచ్పై గెలిచి తన జైత్రయాత్రను ఇక్కడి నుంచే మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది సూపర్ కింగ్స్. దీనికి తగ్గట్టుగా ప్లేయింగ్ 11 ఉండబోతోంది. ఆల్ రౌండర్లకు తుదిజట్టులో చోటు దక్కొచ్చు.

టోర్నమెంట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు- జట్టు కేప్టెన్గా ఎంఎస్ ధోనీని తప్పించడం, అతని స్థానంలో డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు జట్టు పగ్గాలను అప్పగించడం కొంత ప్రతికూలంగా మారుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్లేయర్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
ఐపీఎల్ టోర్నమెంట్ మొత్తానికీ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏదైనా ఉందంటే అది సూపర్ కింగ్సే. ముంబై ఇండియన్స్తో సమానంగా అయిదుసార్లు ఛాంపి నిలిచింది ఈ ఎల్లో ఆర్మీ. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లల్లో కప్ కొట్టిందీ టీమ్. అన్నిసార్లూ ధోనీనే కేప్టెన్. అలాంటి సారథిని టోర్నమెంట్ ఆరంభం కావడానికి చివరి నిమిషంలో తొలగించడం కలకలం రేపుతోంది.
ఈ వ్యవహారంపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ధోనీని కేప్టెన్సీ నుంచి తొలగించాలనుకోవడం తమ నిర్ణయం కాదని పేర్కొన్నాడు. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తానే తప్పుకొంటానని ధోనీ స్వయంగా వెల్లడించాడని, అతని కోరికను కాదనలేకపోయామని వివరణ ఇచ్చాడు. జట్టు భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.
కేప్టెన్సీ మార్పునకు ఇదే సరైన సమయమని, రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందనేది తమ సమష్టి నిర్ణయమని చెప్పుకొచ్చాడు ఫ్లెమింగ్. ధోనీ ది బెస్ట్ జడ్జ్ అని, తన వారసుడిగా సరైన ప్లేయర్ను ఎన్నుకున్నాడని వ్యాఖ్యానించాడు.
ఈ సీజన్ మొత్తానికీ ధోనీ అందుబాటులో ఉంటాడనే తాను భావిస్తున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు ఫ్లెమింగ్. వయసు మీద పడటం, ఫిట్నెస్.. వంటి సమస్యల వల్ల ధోనీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని తాను అనుకోవట్లేదని పేర్కొన్నాడు. ధోనీ గత సీజన్ కంటే ఫిట్గా ఉన్నాడని కితాబిచ్చాడు.