హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు విజయాలు సాధించి ఏడో స్థానానికి ఎగబాకింది. వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించి నెట్రన్రేటును కూడా మెరుగుపర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (61; 40 బంతుల్లో, 4x4, 3x6), దినేశ్ కార్తీక్ (53*; 23 బంతుల్లో, 5x4, 4x6), రజత్ పటిదార్ (50; 26 బంతుల్లో,3x4, 4x6) అర్ధశతకాలతో సత్తాచాటారు. బుమ్రా అయిదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టాడు.

అనంతరం ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (68; 34 బంతుల్లో, 7x4, 5x6), సూర్యకుమార్ యాదవ్ (52; 19 బంతుల్లో, 5x4, 4x6) విజృంభించారు. హార్దిక్ పాండ్య (51; 6 బంతుల్లో, 3x6) ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వైడ్, బౌండరీ, నోబాల్ విషయంలో అంపైర్లు ఘోర తప్పిదమైన నిర్ణయాలు తీసుకున్నారని విమర్శలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ మ్యాచ్కు సంబంధించిన మరో ఘటనపై చర్చ మొదలైంది. టాస్ను ముందే ఫిక్స్ చేశారని, ఆర్సీబీ టాస్ గెలిచినా ముంబై ఇండియన్స్ గెలిచినట్లుగా ప్రకటించారని ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. మ్యాచ్ రిఫరీతో పాటు మాజీ క్రికెటర్ శ్రీనాథ్పై నెటిజన్లు నిందలు మోపారు. శ్రీనాధ్ కాయిన్ను రివర్స్ తిప్పి ముంబై గెలిచిందని వెల్లడించాడని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ల ఆరోపణలకు తగ్గట్లుగానే ఆ స్పష్టత లేని వీడియో ఉండటం గమనార్హం.
అయితే టాస్కు సంబంధించిన మరో క్లారిటీ వీడియోతో బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. టాస్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టత వచ్చింది. శ్రీనాథ్ కాయిన్ను తిప్పలేదని, యథావిధంగా ఉంచి టాస్ విజేతను ప్రకటించినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో ముంబై-ఆర్సీబీ మ్యాచ్ టాస్ గొడవకు ఓ ముగింపు లభించింది. కానీ అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.