IPL 2024: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతేడాది వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఈ ఏడాది వదిలేసింది. హార్దిక్ పాండ్యా కోసం గ్రీన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రేడ్ ద్వారా పంపేసింది. ఈ వార్త విన్న ముంబై ఫ్యాన్స్ చాలా మంది ఆశ్చర్యపోయారు.
అయితే పాండ్యా మళ్లీ ముంబైకి రావడంతో వాళ్ల టెన్షన్ కొంత తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే పాండ్యా ప్రస్తుతం చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ మధ్యలో అతను గాయపడకుండా ఉండి ఉంటే.. భారత జట్టు ట్రోఫీ నెగ్గేదని కూడా కొందరు అంటున్నారు. ఈ క్రమంలో తాను ఆర్సీబీకి వెళ్లిపోవడంపై గ్రీన్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాడు. తాజాగా ఇన్స్టాగ్రాంలో దీనిపై అతను మాట్లాడాడు.

ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో ఈ 24 ఏళ్ల ఆసీస్ ఆల్రౌండర్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్తో కలిసి పని చేయడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పలు టీ20 లీగుల్లో ఫ్లవర్ తనదైన మార్కు చూపించిన సంగతి తెలిసిందే.
'హే ఆర్సీబీ ఫ్యాన్స్.. నేను మీ కామెరూన్ గ్రీన్. నేను ఆండీ ఫ్లవర్తో కలిసి పని చేయడానికి చాలా ఎగ్జయిటింగ్గా ఉన్నా. మీ అందర్నీ చిన్నస్వామి స్టేడియంలో చూసే సమయం కోసం చాలా ఆత్రంగా ఉన్నా' అని గ్రీన్ చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఆర్సీబీ హెడ్ కోచ్గా మైక్ హెసాన్ పదవీకాలం ముగిసింది.
అతని అగ్రిమెంట్ను ఇంకొంత కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆర్సీబీ మాత్రం ఆ పని చేయలేదు. హెసాన్ స్థానంలో ఆండీ ఫ్లవర్ను తీసుకుంది. బ్యాటింగ్ కోచ్గా కూడా సంజయ్ బంగర్ను తొలగించి కొత్త వారిని తీసుకుంది. ఇలాగైనా ఆ టీం రాత మారుతుందని ఆర్సీబీ యాజమాన్యం ఫీల్ అవుతోంది.