మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్గ్రాత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు విశ్రాంతి అవసరమని, అవిరామంగా క్రికెట్ ఆడితో అతని కెరీర్కే ప్రమాదరకరమని మెక్గ్రాత్ పేర్కొన్నాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై టైటిల్ విజయాల్లో బుమ్రాది కీలక పాత్ర. అయితే గత ఐపీఎల్ సీజన్లో బుమ్రా ఆడలేదు. వెన్నెముక గాయంతో అతడు తప్పుకున్నాడు. అప్పటికీ బుమ్రా ఫిట్నెస్ సాధించాడని, కానీ వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాని విశ్రాంతి తీసుకోమని బీసీసీఐ సూచించిందని కథనాలు వచ్చాయి.

బీసీసీఐ తీసుకున్న ఆ నిర్ణయం సత్ఫలితాన్నిచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్కు టీమిండియా చేరడంలో 20 వికెట్లతో బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు. కానీ మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోపే మెగాటోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి మెక్గ్రాత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
''బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్కు విశ్రాంతి అవసరం. ఎందుకంటే అతడు ప్రతిబంతిని తీవ్రతతో బౌలింగ్ చేస్తాడు. విస్తృత ప్రయత్నంతో బౌలింగ్ చేసే అతడికి విరామం కావాలి. కానీ అతడు ఆటను అలానే కొనసాగిస్తే శరీరంపై భారం పడుతుంది. బౌలింగ్ యాక్షన్పై ప్రభావం చూపుతుంది. అంతేగాక అతడు గాయపడే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా అతడు ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నాడు'' అని మెక్గ్రాత్ తెలిపాడు.
మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుతో బుమ్రా ఇంకా చేరలేదు. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్లో పాల్గొన్న బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. అయిదు టెస్టుల సిరీస్లో ఓ టెస్టు మినహా మిగిలిన మ్యాచ్లన్నీ ఆడాడు. 19 వికెట్లు సత్తాచాటాడు. కాగా, గురువారం బుమ్రా ముంబై జట్టుతో చేరే అవకాశం ఉంది. మార్చి 24న ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి.