Chennai Super Kings: ఐపీఎల్ 2024.. ప్లేఆఫ్స్ దశకు సమీపించింది. ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ 11.. మిగిలిన అన్ని జట్లు కూడా పదేసి చొప్పున మ్యాచ్లు ఆడేశాయి. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తమ 11వ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ గెలుపోటములు ఈ రెండింటి ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తాయి.
ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా వైదొలగినట్టయింది. నేటి మ్యాచ్లో ఓడిపోయే జట్టు కూడా ఈ జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూడు జట్లూ పాయింట్ల పట్టికలో 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలను దాదాపుగా పోగొట్టుకున్నట్టే.

ప్లే ఆఫ్స్ రేసులో టాప్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్కు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు జట్లు కూడా తాజాగా గాయాల బారిన పడ్డాయి. ఈ రెండింట్లోనూ ఫాస్ట్ బౌలర్లు గాయపడ్డారు. ఇది- ఆయా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేయగలుగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, మయాంక్ యాదవ్ గాయాల బారిన పడ్డారు. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను దూరం అయ్యారు. దీపక్ చాహర్ హామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ బారిన పడ్డాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్ గాయపడ్డాడు. రెండు బంతులు మాత్రమే వేసి గ్రౌండ్ వీడాడు.
అతని గాయంపై అప్డేట్ ఇచ్చాడు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్. మిగిలిన మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండటం అనుమానమేనని తేల్చి చెప్పారు. తన తదుపరి మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ధర్మశాలకు వెళ్లలేదు చాహర్. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నాడు. తుషార్ దేశ్పాండే సైతం ఫ్లూతో బాధపడుతున్నాడు.
పంజాబ్ కింగ్స్తో ధర్మశాలతో జరిగే ఈ మ్యాచ్లో మతీషా పతిరానాను తుదిజట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. ఇందులో గెలిస్తే 12 పాయింట్లతో టోర్నమెంట్లో ముందడుగు వేయగలుగుతంది సీఎస్కే.
లక్నో సూపర్ జెయింట్స్లో మయాంక్ యాదవ్ పరిస్థితీ దాదాపుగా ఇంతే. కిందటి నెల 30వ తేదీన ముంబై ఇండియన్స్తో మ్యాచ్ తరువాత అతను మళ్లీ కనిపించలేదు. సైడ్ స్ట్రెయిన్తో అతను బాధపడుతున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడే మిగిలిన మ్యాచ్ల కోసం అందుబాటులో ఉండకపోవచ్చు.