ఐపీఎల్-2024 హోరాహోరీగా సాగుతోంది. 17వ సీజన్ ప్రారంభమై పది రోజలే దాటింది. అయినప్పటికీ ఈ కొద్ది రోజుల్లోనే క్రేజీ రికార్డులు, అదిరే సిక్సర్లు, వికెట్ల మోత, కళ్లుచెదిరే క్యాచ్లు నమోదయ్యాయి. అయితే సాఫీగా సాగుతున్న ఈ సీజన్ మధ్యలో బ్రేక్ పడే అవకాశం ఉంది. ఓ ఐపీఎల్ మ్యాచ్ను వాయిదా వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈడెన్గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 17వ తేదీన జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే శ్రీరామనవమి ఉత్సవాలు, మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా పరమైన సమస్యలను అధిగమించడానికి మ్యాచ్ను వాయిదా వేయాలని చూస్తోంది.

ఇప్పటికే రీషెడ్యూల్కు సిద్ధంగా ఉండాలని కేకేఆర్, రాజస్థాన్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కబురు పంపినట్లు సమాచారం. అలాగే మ్యాచ్ వాయిదా పడే అవకాశం గురించి బ్రాడ్కాస్టర్స్కు కూడా సమాచారాన్ని చేరవేసిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, బీసీసీఐ పెద్దలు క్రికెట్ అసోషియేష్ ఆఫ్ బెంగాల్, కోల్కతా పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. కాగా, బెంగాల్ పోలీసులు మ్యాచ్ భద్రతపై గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేకేఆర్-పోరు షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది.
అన్ని ఫ్రాంచైజీలతో ఏప్రిల్ 16న మీటింగ్
మరోవైపు ఏప్రిల్ 16న అహ్మదాబాద్లో అన్ని ఫ్రాంచైజీలతో బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు సమావేశం కానున్నారు. వచ్చే సీజన్ కోసం నిర్వహించే ఐపీఎల్ మెగా వేలం గురించి మీటింగ్లో చర్చించనున్నారు. మెగా వేలం విధివిధానాలు, ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్, రైట్ టు మ్యాచ్ కార్డ్ గురించి మాట్లాడనున్నారు.
కాగా, మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 17వ సీజన్ మే 26న ముగుస్తుంది. మే 19తో లీగ్ స్టేజ్ మ్యాచ్లు పూర్తికానున్నాయి. కేకేఆర్-ఆర్ఆర్ మ్యాచ్ వాయిదా పడితే మే 18వ తేదీ లోపే నిర్వహించడానికి ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 19న రెండు మ్యాచ్లు ఉన్నాయి. అలాగే మే 20 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి.